వారికంటే రేవంత్ రెడ్డి ప్రమాదకరం: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్

  • అమరవీరులను అవమానించేలా రేవంత్ రెడ్డి మాట్లాడారని ఆగ్రహం
  • రేవంత్ మాటలతో అమరుల ఆత్మ ఘోషిస్తుందన్న ఎర్రోళ్ల శ్రీనివాస్
  • కేసీఆర్ పుణ్యాన రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ వారికి పదవులు వచ్చాయని వ్యాఖ్య
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సమైక్యవాదుల కంటే అత్యంత ప్రమాదకరమని విమర్శించారు. సమైక్యవాదుల ముసుగులో రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్నారు. అమరవీరులను అవమానించేలా రేవంత్ రెడ్డి మాట్లాడారని... ఆయన మాటలతో అమరుల ఆత్మ ఘోషిస్తుందన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి బేషరతుగా అమరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అమరుల స్తూపాన్ని తెలంగాణ సమాజం దైవంలా భావిస్తుందని, దాని విలువ కాంగ్రెస్ పార్టీకి తెలుసా? అని నిలదీశారు. రేవంత్ రెడ్డిలో అణువణువునా తెలంగాణ వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. కేసీఆర్ పుణ్యాన రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలకు పదవులు వచ్చాయని విమర్శించారు. రుణమాఫీపై రాజీనామాతో రమ్మని హరీశ్ రావు సవాల్ విసిరితే రేవంత్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేశారన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డిలు చిల్లరగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి దేవుళ్లను కూడా మోసం చేసే వ్యక్తి అన్నారు.

BRS
Errolla Srinivas
Telangana

More Telugu News