కడప నుంచి రౌడీలు, గూండాలు వస్తున్నారట... ఎంతమంది వస్తారో రండి!: నాగబాబు
- పిఠాపురంలో పవన్ ను ఓడించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయన్న నాగబాబు
- మిథున్ రెడ్డి వల్ల కూడా కాకపోవడంతో కడప నుంచి రప్పిస్తున్నారని వెల్లడి
- ఎవరిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని స్పష్టీకరణ
స్థానికుల నుంచి కొత్తగా తమకు అందిన సమాచారం ప్రకారం... పిఠాపురంలో మిథున్ రెడ్డి వల్ల కూడా కావడం లేదని, అందుకే కడప నుంచి కొందరు రౌడీలను, గూండాలను పిఠాపురం పంపించినట్టు తెలిసిందని నాగబాబు వెల్లడించారు. మీరెంతమంది వస్తారో రండి... ఇక్కడ మేం సిద్ధంగా ఉన్నాం, మా పిఠాపురం ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని సమరోత్సాహం ప్రదర్శించారు.
మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరంలో ఉందో, మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం ఉంటుందన్న విషయాన్ని అవతలివారు గుర్తుంచుకోవాలని నాగబాబు స్పష్టం చేశారు.
"ఎంతమంది గూండాలను పంపిస్తారో పంపించండి... వారిని ఇక్కడ ఎలా ఎదుర్కోవాలో మా యంత్రాంగం మాకు ఉంది. పిఠాపురం ప్రజల మద్దతు మాకుంది. మీరు మర్యాదగా ఉంటే మేం కూడా మర్యాదగా ఉంటాం. మీరు దారితప్పితే మాకు వేరే ఆప్షన్ లేదు... బీకేర్ ఫుల్!" అంటూ నాగబాబు హెచ్చరించారు.