Telangana women: యూపీ ఎన్నికల్లో తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీ

  • జౌన్ పుర్ లోక్ సభ నియోజకవర్గంలో నామినేషన్
  • మాజీ ఎంపీ ధనుంజయ్ సింగ్ మూడో భార్య
  • జైలు శిక్ష పడడంతో ధనుంజయ్ పై అనర్హత.. శ్రీకళారెడ్డికి బీఎస్పీ టికెట్
Telangana Women In Uttarapradesh Poll Fray

ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ ఒకరు పోటీ చేస్తున్నారు. క్రిమినల్ కేసులో శిక్ష పడడంతో ఆమె భర్త ఎన్నికల్లో పోటీ చేయడం కుదరడంలేదు.. దీంతో భర్త తరఫున ఆమె బరిలో దిగారు. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) టికెట్ పై జౌన్ పుర్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీచేస్తున్నారు. తెలంగాణలోని నల్గొండకు చెందిన శ్రీకళారెడ్డి యూపీ ఎంపీ ధనుంజయ్ సింగ్ ను మూడో పెళ్లి చేసుకున్నారు. జౌన్ పుర్ నియోజకవర్గంలో సింగ్ కు మంచి పట్టుంది.. అయితే, ఓ కిడ్నాప్, అక్రమ వసూళ్లకు సంబంధించిన కేసులో ఆయనకు కోర్టు శిక్ష విధించింది. దీంతో చట్టప్రకారం ఈ ఎన్నికల్లో ధనుంజయ్ సింగ్ పోటీ చేయడం కుదరదు. స్థానికంగా పట్టున్న నేత కావడంతో బీఎస్పీ జౌన్ పుర్ టికెట్ ను వేరే వారికి కేటాయించలేక సింగ్ భార్యను ఎన్నికల్లో నిలబెట్టింది. పార్టీ టికెట్ ఇచ్చి లోక్ సభ బరిలో దింపింది.

రాజకీయ, వ్యాపార నేపథ్యం..
హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా, నల్గొండ జిల్లా కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా సేవలందించిన కె.జితేందర్ రెడ్డి కుమార్తె ఈ శ్రీకళారెడ్డి.. ఆమె తల్లి లలితారెడ్డి గ్రామ సర్పంచిగా సేవలందించారు. నిప్పో బ్యాటరీ కంపెనీ జితేందర్ రెడ్డిదే.. ఈ వ్యాపారం కారణంగా శ్రీకళారెడ్డి చిన్నతనంలో ఆమె కుటుంబం చెన్నైలో నివసించింది. ఇంటర్ దాకా చెన్నైలో చదివిన శ్రీకళారెడ్డి.. హైదరాబాద్ లో బీకామ్ పూర్తిచేసి అమెరికా వెళ్లారు. అక్కడ అర్కిటెక్చర్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చదివారు. తిరిగొచ్చి కుటుంబ వ్యాపారాలను చూసుకున్నారు. 2017లో ధనుంజయ్ సింగ్, శ్రీకళారెడ్డిల వివాహం పారిస్ లో ఘనంగా జరిగింది.

అప్పటికే ధనుంజయ్ కి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య చనిపోగా రెండో భార్య విడాకులు తీసుకుంది. వివాహం తర్వాత శ్రీకళారెడ్డి యూపీలో భర్తతో కలిసి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జెడ్పీ చైర్ పర్సన్ గానూ సేవలందించారు. తాజాగా, జౌన్ పుర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున లోక్ సభకు పోటీ చేస్తున్నారు. కాగా, తనకు రూ.786.71 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు, రూ.1.74 కోట్ల విలువైన నగలు ఉన్నట్లు శ్రీకళారెడ్డి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు.

More Telugu News