Stone Attack On Jagan: జగన్ ఉంటే తమకు పుట్టగతులు ఉండవనే చంద్రబాబు ఈ దారుణానికి పాల్పడ్డారు: రోజా

ఎన్నికల ప్రచారంలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన రాయిదాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రి ఆర్కే రోజా నిరసనకు దిగారు. జగన్‌‌పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. చంద్రబాబు దౌర్జన్యం నశించాలని నినాదాలు చేశారు. జగన్ చేస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు.

జగన్ అనేవాడు ఉంటే మనకు డిపాజిట్లు కూడా రావని తెలిసి చంద్రబాబు నాయుడే ఈ పనికి పాల్పడ్డారని, జగన్‌పై హత్యాయత్నం చేయించారని ఆరోపించారు. ఈ ఘటనను ఈసీ సీరియస్‌గా తీసుకుని వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎవరెవరితో ఈ తప్పు చేయించారో అందరి మీద కేసులు నమోదు చేసి అందరినీ అరెస్ట్ చేయాలని కోరారు. ప్రజాస్వామ్యంలో తాము ఏం చేశామో ప్రజలకు చెప్పి అధికారంలోకి రావాలి కానీ, ఇలా దాడులు చేసి అధికారంలోకి రావాలని చూడడం సరికాదని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ తమ ప్రసంగాల ద్వారా తప్పుదారిపట్టిన యువతను రెచ్చగొడుతున్నారని రోజా ఆరోపించారు.

Stone Attack On Jagan
RK Roja
YSRCP
Puttur
Nagari

More Telugu News