తనిఖీల్లో రూ.10 కోట్లకు పైగా పట్టుబడ్డాయి: లోక్ సభ ఎన్నికలపై సమీక్ష సందర్భంగా సీఎస్ శాంతికుమారి
- అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే పని చేశారో అదే స్ఫూర్తితో లోక్ సభ ఎన్నికల్లోనూ పని చేయాలని సూచన
- మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ సరిహద్దులలో ప్రత్యేకంగా చెక్పోస్ట్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడి
- వివిధ శాఖల ద్వారా తెలంగాణలో పలు చెక్పోస్టులను ఏర్పాటు చేశామన్న సీఎస్ శాంతికుమారి
సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ సరిహద్దులలో ప్రత్యేకంగా చెక్పోస్ట్లను ఏర్పాటు చేయాలని... అక్కడ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ, ప్రవర్తనా నియమావళి అమలుపై అన్ని ప్రధాన శాఖల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివిధ శాఖల ద్వారా రాష్ట్రంలో ఇప్పటికే చెక్పోస్ట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిలో పోలీస్ శాఖ ద్వారా 444 చెక్పోస్ట్లు, 9 అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు తనిఖీలలో రూ.10 కోట్లు పట్టుబడినట్లు తెలిపారు. నగదుతో పాటు లైసెన్స్ లేని ఆయుధాలు, పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్స్, బంగారం కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు.
రవాణా శాఖ ద్వారా ఇరవై నాలుగు గంటలూ పని చేసే 15 చెక్పోస్ట్లు, 52 ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రవాణాశాఖ బృందాలు జరిపిన తనిఖీల్లో రూ.34.31 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా 16 అంతర్రాష్ట్ర చెక్పోస్ట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వాటితోపాటు 31 స్ట్రాటెజిక్ పాయింట్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెప్పారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి వివిధ వస్తువులను పంచడానికి అవకాశం ఉన్న 25 గోడౌన్లను గుర్తించి... నిఘా ఉంచినట్లు తెలిపారు. మరో 141 గోదాములు, 912 వివిధ వస్తువుల తయారీ గోదాములపై నిఘా ఉంచినట్లు చెప్పారు.
ఎక్సైజ్ శాఖ ద్వారా 21 అంతర్రాష్ట్ర చెక్పోస్ట్లు, ఆరు మొబైల్ చెక్పోస్ట్లు ఏర్పాటు చేశామన్నారు. అక్రమ మద్యం తయారీకి అవకాశం ఉన్న ఎనిమిది జిల్లాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. మద్యం అక్రమ రవాణాకు అవకాశమున్న ఐదు రైలు మార్గాలను గుర్తించి వాటి నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటి వరకు రూ.50 లక్షల విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. డిస్టిల్లరీలపై నిఘా ఉంచడంతో పాటు సీసీటీవీల ద్వారా మద్యం సరఫరాను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అటవీ శాఖ ద్వారా కూడా 65 చెక్పోస్ట్లు ఏర్పాటు చేశామని... ఇందులో 18 అంతర్రాష్ట్ర చెక్పోస్ట్లు ఉన్నాయన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియామావళిని పటిష్టంగా అమలు చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.