CAA: CAAని కేరళలో అమలు చేయబోం: ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టీకరణ

పౌరసత్వ సవరణ బిల్లు-2019 (CAA)ని తాము అమలు చేయబోమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. ఈ చట్టం దేశంలో మతపరమైన విభజన సృష్టించే చట్టమన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ... ముస్లిం మైనార్టీలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని కేరళలో తాము అమలు చేసేది లేదని తేల్చి చెప్పారు. గతంలో కూడా ఇదే విషయం చెప్పామన్నారు. సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ యావత్ కేరళ ఏకతాటిపై నిలబడాలని పిలుపునిచ్చారు.

కేంద్రం తీసుకు వచ్చిన సీఏఏ చట్టంపై ప్రజలు రానున్న లోక్ సభ ఎన్నికల్లో స్పందిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వివాదాస్పద ఎన్నికల బాండ్ల అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు దీనిని తెరపైకి తీసుకు వచ్చిందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. మన దేశానికి చెందిన వారే విదేశాల బాట పట్టినప్పుడు ఇతరుల కోసం పౌరసత్వ సవరణ చట్టం అమలు వల్ల ప్రయోజనం ఏమిటని సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. గత పదేళ్లలో లక్ష మంది భారత పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
CAA
Pinarayi Vijayan
Kerala
BJP

More Telugu News