Rajnath Singh: భారత్ కు ఎవరైనా సవాల్ విసిరితే వారు తప్పించుకునే పరిస్థితి లేదు: రాజ్ నాథ్ సింగ్ వార్నింగ్

ఢిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన దేశ రక్షణ సదస్సుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారత్ ఎవరి భూభాగాన్నీ ఆక్రమించలేదని, కానీ భారత్ జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. 

భారత్ కు ఎవరైనా సవాల్ విసిరితే వారు తప్పించుకునే పరిస్థితి లేదని హెచ్చరించారు. ఎవరైనా మనపై దాడికి పాల్పడితే దీటుగా బదులిచ్చే స్థితిలో ఉన్నాం అని స్పష్టం చేశారు. 

మోదీ ప్రభుత్వం వచ్చాక రక్షణ విభాగానికి కేటాయింపులు పెరిగాయని, భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రక్షణ రంగంలోనూ ఆత్మనిర్భరతను తీసుకువచ్చామని రాజ్ నాథ్ వివరించారు. 

సవాళ్లు ఏ రూపంలో ఎదురైనా, వాటిని ఎదుర్కోగల సత్తా భారత్ కు ఉందని అన్నారు.  అందుకు గల్వాన్ లోయలో చైనా దళాలను మన బలగాలు ఎదుర్కొన్న తీరే అందుకు నిదర్శనం అని వివరించారు. భూతల, గగనతల, సముద్ర మార్గాల్లో దాడులు జరిగినా ఎదుర్కొనేందుకు భారత దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

శాంతి సమయంలోనూ ఏమరుపాటుకు తావివ్వకుండా, అన్నివేళలా యుద్ధ సన్నద్ధతతో ఉండాలన్నది తమ విధానమని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
Rajnath Singh
Defence Summit
BJP
New Delhi
India

More Telugu News