రేవంత్ రెడ్డి భాషను ఖండిస్తున్నాం: బీఆర్ఎస్ నేత బాల్క సుమన్

చేవెళ్ల బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఖండించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చేవెళ్ల సభలో సీఎం మాట్లాడిన భాషని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, హామీలను నమ్మి ఓట్లు వేస్తే ప్రజలకు శఠగోపం పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ఇస్తామని చెప్పిన గ్యారెంటీలు 90 లక్షల రేషన్ కార్డుదారులకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. కోటీ ఐదు లక్షల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నారు.

రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరిగిన చెల్లింపులపై శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా? అని ప్రశ్నించారు. మీరు అధికారంలోకి వచ్చాక ఏ కంపెనీలకు డబ్బులు చెల్లించారు? గుత్తేదారులకు చేసిన చెల్లింపులపై శ్వేతపత్రం ఇవ్వగలరా? అని నిలదీశారు. అర్హులైన వారికి వెంటనే రైతుబంధు ఇవ్వాలన్నారు. మెగా డీఎస్సీ వేయడంతో పాటు నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Balka Suman
BRS
Congress
Revanth Reddy

More Telugu News