Rhea Chakraborty: సుశాంత్‌ సింగ్‌ మృతి కేసు.. రియా చక్రవర్తికి భారీ ఊరట

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో సినీ నటి రియా చక్రవర్తికి, ఆమె కుటుంబ సభ్యులకు పెద్ద ఊరట లభించింది. వీరిపై సీబీఐ జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ ను బాంబే హైకోర్టు రద్దు చేసింది. తాము సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ఈ ఆర్డర్ పై నాలుగు వారాల పాటు స్టే విధించాలన్న సీబీఐ తరపు న్యాయవాది విన్నపాన్ని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తిరస్కరించింది. 

2020 జూన్ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే సుశాంత్ ది ఆత్మహత్య కాదని... రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తూ సుశాంత్ కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి రూ. 15 కోట్లు బదిలీ చేసుకున్నారంటూ ఆయన తండ్రి కేకే సింగ్ ఆరోపించారు. 

ఈ క్రమంలో రియా చక్రవర్తిని ఈడీ ప్రశ్నించింది. ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి సుప్రీంకోర్టు అప్పగించింది. సుశాంత్ కు డ్రగ్స్ ఇచ్చిందనే ఆరోపణలను రియా, ఆమె సోదరుడు షోవిక్, తండ్రి ఇంద్రజిత్ ఎదుర్కొన్నారు. వీరిద్దరూ జైలుకు కూడా వెళ్లారు. ఈ క్రమంలో వీరు విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్ ను కూడా జారీ చేసింది. దీంతో వీరు బాంబే హైకోర్టును ఆశ్రయించగా... లుకౌట్ సర్క్యులర్ ను రద్దు చేస్తూ తీర్పును వెలువరించింది.
Rhea Chakraborty
Sushant Singh Rajput
Bollywood

More Telugu News