విమానం టేకాఫ్ ఆలస్యం..ఎమర్జెన్సీ డోర్ తెరిచి రెక్కపైకి ఎక్కిన ప్యాసెంజర్
- మెక్సికో సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో గురువారం ఘటన
- ఉదయం 8.42 గంటలకు బయలుదేరాల్సిన విమానం 4 గంటల పాటు ఆలస్యం
- తీవ్ర అసహనానికి గురైన ప్యాసెంజర్ ఎమర్జెన్సీ డోర్ తెరిచి బయటకొచ్చిన వైనం
ఏరో మెక్సికోకు చెందిన ఏఎమ్ 672 విమానం గురువారం ఉదయం 8.42 గంటలకు గ్వాటమాలాకు బయలుదేరాల్సి ఉంది. అయితే, కొన్ని కారణాల వల్ల విమానం నాలుగు గంటల పాటు ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది. ఈలోపు ప్రయాణికుల్లో ఒకరు తీవ్ర అసహనానికి గురయ్యారు. చివరకు విమానం ఎమర్జెన్సీ డోర్ తెరుచుకుని రెక్కపైకి ఎక్కేశాడు. ఇది చూసి కంగుతిన్న సిబ్బంది వెంటనే తేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత స్థానిక పోలీసులకు అప్పగించారు.
మరోవైపు విమానంలోని ఇతర ప్రయాణికులు ఎయిర్లైన్స్పై మండిపడ్డారు. విమానం రెక్కపైకి ఎక్కిన వ్యక్తికి మద్దతు తెలిపారు. నాలుగు గంటల పాటు విమానంలోనే ఉండిపోవాల్సి వచ్చినా కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఎయిర్లైన్స్ మాత్రం ఈ ఘటనపై ఇంకా స్పందించాల్సి ఉంది.