తెలంగాణ ప్రభుత్వం పనితీరు దేశానికే ఆదర్శం కావాలి: మల్లికార్జున ఖర్గే

  • కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో ఖర్గే
  • పార్లమెంట్ ఎన్నికల్లో నేతలు, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని పిలుపు
  • మనమంతా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్న మల్లికార్జున ఖర్గే
తెలంగాణ ప్రభుత్వం పనితీరు దేశానికి ఆదర్శం కావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పార్టీకి బూత్ లెవల్ కార్యకర్తలే బలమన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నేతలు, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు మరో రెండు నెలల సమయం వుందని... అందరం కలిసి పోరాడాలని... బ్లాక్ లెవల్, బూత్ లెవల్, స్టేట్ లెవల్‌లో ఉన్న నాయకులంతా కలిసి పార్టీ కోసం పని చేయాలన్నారు.

ఎన్నికల నేపథ్యంలో ఈడీ, సీబీఐ దాడులు జరిగే అవకాశముందని హెచ్చరించారు. మనమంతా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కృషి చేయాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ మాయమాటలు విని మోసపోవద్దన్నారు. మోదీకి రైతుల బాధలు, కష్టాలు తెలియవని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిందని... దేశాన్ని అప్పుల్లో ముంచారని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు న్యాయం చేసేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చారా? అని ప్రశ్నించారు. సంక్షోభంలో ఉన్నప్పుడు మోదీకి పాకిస్థాన్, చైనా, దేవుడు గుర్తుకు వస్తాయని ఆరోపించారు.

Mallikarjun Kharge
Telangana
Congress
Revanth Reddy

More Telugu News