Baba Ramdev: అయోధ్య రామ మందిరం వద్ద రాందేవ్ బాబా ఆసక్తికర వ్యాఖ్యలు

అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాల రాముడు టెంట్ లో ఉన్నప్పుడు తాను ఇక్కడకు వచ్చానని తెలిపారు. ఈ రోజు బాల రాముడికి ఒక గొప్ప ఆలయం వచ్చిందని చెప్పారు. రాముడు టెంట్ నుంచి ఆలయంలోకి వస్తున్నాడని అన్నారు. 

సనాతన ధర్మానికి సంబంధించి ఈ రోజు ఒక సరికొత్త చరిత్ర ఆవిష్కృతం అవుతోందని రాందేవ్ బాబా అన్నారు. రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో రామ రాజ్యం ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈరోజు దేశమంతా రామమయం అయిందని అన్నారు. సనాతన ధర్మానికి సంబంధించిన వేడుక ఇదని చెప్పారు. హిందువుల శతాబ్దాల కల నెరవేరిందని అన్నారు. రాముడు సాధువు కాదని ఎవరు చెప్పగలరని ప్రశ్నించారు. 

విగ్రహ ప్రతిష్ఠ ముహూర్తం సరిగా లేదంటూ ప్రజలను భయపెట్టవద్దని రాందేవ్ బాబా అన్నారు. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ పవిత్రత ఉంటుందని చెప్పారు. నిర్మాణం పూర్తికాని మందిరాన్ని ప్రారంభిస్తున్నారనే విమర్శలపై ఆయన స్పందిస్తూ... ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రారంభించడం అపరాధం అని కొందరు విమర్శిస్తున్నారని... రాముడు ఉన్న చోట అపరాధం ఉండదని చెప్పారు.
Baba Ramdev
Ayodhya
Ayodhya Ram Mandir
Lord Rama

More Telugu News