54 వేల మెజార్టీతో గెలిపించి నాపై పెద్ద బాధ్యత పెట్టారు: దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి

  • బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా ప్రజల అవసరాలు తీర్చేలా పని చేస్తానన్న ఎమ్మెల్యే
  • అధికారంలో లేకపోయినా హరీశ్ రావు గతంలో అభివృద్ధి చేశారన్న ప్రభాకర్ రెడ్డి
  • హరీశ్ రావును మాజీ మంత్రి అని అననంటూ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్య
దుబ్బాక నుంచి 54 వేల మెజార్టీతో తనను గెలిపించి తనపై చాలా బాధ్యత పెట్టారని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గంలో కృతజ్ఞత సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజల అవసరాలను తీర్చేలా పని చేస్తానని హామీ ఇచ్చారు. తనకు దుబ్బాక ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చారని.. వారి రుణం తీర్చుకుంటానని వ్యాఖ్యానించారు. గతంలో అధికారంలో లేకపోయినా హరీశ్ రావు సిద్దిపేటను అభివృద్ధి చేశారని... అలాగే తామిద్దరం జోడెద్దుల్లా పని చేసి దుబ్బాక, సిద్దిపేటను అభివృద్ధి చేస్తామన్నారు.

హరీశ్ రావును తాను మాజీ మంత్రి అని అనని... తర్వాత తిరిగి తాజా మంత్రి అవుతాడని జోస్యం చెప్పారు. ఇది ఎన్నికల సంవత్సరమని, కార్యకర్తలు నిరాశపడాల్సిన అవసరం లేదన్నారు. కష్టపడి లోక్ సభ ఎన్నికల్లో పని చేసి, అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకుందామని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అందరం కలిసి పని చేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. రానున్నది మన ప్రభుత్వమే కాబట్టి కార్యకర్తలు అధైర్యపడవద్దన్నారు.


More Telugu News

kotha prabhakar reddy Telangana BRS