గురితప్పిన గుల్లేరు.. పిట్టను కొట్టబోతే వందేభారత్ రైలు అద్దాలు బద్దలు!

  • వందేభారత్ రైలు అద్దాలపై దాడి కేసులో జనగామకు చెందిన హరిబాబు అరెస్ట్
  • తాను కావాలని కొట్టలేదన్న నిందితుడు
  • అరెస్ట్ చేసి గుల్లేరును స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లు విసిరిన కేసులో కాజీపేట ఆర్పీఎఫ్ పోలీసులు నిన్న హరిబాబును అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం జనగామకు చెందిన హరిబాబు (60) పిట్టలను కొట్టి వాటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం జనగామ సమీపంలో గుల్లేరుతో పిట్టలను కొట్టే క్రమంలో అది గురితప్పింది. అదే సమయంలో విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు రాయి తాకడంతో అద్దం కాస్తా పగిలింది. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ చేపట్టగా గుల్లేరుతో కొట్టింది హరిబాబేనని తేలింది. దీంతో నిన్న ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన నుంచి గుల్లేరును స్వాధీనం చేసుకున్నారు. తనను అరెస్ట్ చేయడంపై హరిబాబు మాట్లాడుతూ తాను రైలుకు గురిపెట్టలేదని, పిట్టను కొట్టబోతే పొరపాటున అది రైలుకు తాకిందని, ఇందులో తన  తప్పేమీ లేదని చెప్పుకొచ్చాడు.

Vandebharat Express Rail
Janagaon
Kazipet Railway Police

More Telugu News