నువ్వు రావాల్సిందే అని లోకేశ్ ఆహ్వానించాడు: పవన్ కల్యాణ్
- టీడీపీ యువగళం సభకు పవన్ హాజరు
- సభలో లోకేశ్ ఉంటేనే బాగుంటుందని చెప్పానని వెల్లడి
- కానీ లోకేశ్ పట్టుబట్టి తనను ఆహ్వానించాడని వివరణ
- చంద్రబాబు కూడా కోరడంతో కాదనలేకపోయానన్న జనసేనాని
యువగళం సభకు ఆహ్వానించిన కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి, యువనేత నారా లోకేశ్ కు, టీడీపీ పెద్దలు, తెలుగుమహిళలు, తెలుగుదేశం కార్యకర్తలకు పేరుపేరునా హృదయపూర్వక నమస్సుమాంజలి అంటూ ప్రసంగం ప్రారంభించారు. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు, జనసేన శ్రేణులు, వీరమహిళలకు శుభాభివందనం... సోదరుడు నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక అభినందనలు అంటూ పేర్కొన్నారు.
"నన్ను సభకు ఆహ్వానించినపుడు నేను ఒకటే చెప్పాను, 226 రోజులు, 3,132 కి.మీ. నడిచినందున యాత్ర ముగింపు సభలో లోకేశ్ ఉంటేనే బాగుంటుందని చెప్పాను. కానీ, ఈ సభలో నువ్వు ఉండాలి అంటూ లోకేశ్ ఆహ్వానించాడు. నాలుగు దశాబ్ధాల సుదీర్ఘ అనుభవజ్ఞుడు చంద్రబాబు కోరడంతో ఇక్కడకు వచ్చాను. లోకేశ్ యువగళం జగన్ లాంటి ఆషామాషీ పాదయాత్ర కాదు, మాటల యాత్ర కాదు, చేతల యాత్ర. ఈ సందర్భంగా లోకేశ్ కు అభినందనలు" అని వివరించారు.