Nara Lokesh: 10 కి.మీ దూరానికి కూడా హెలికాప్టర్లో వెళ్లే రిచెస్ట్ సీఎంకు ట్రాఫిక్ కష్టాలు తెలుస్తాయా?: నారా లోకేశ్

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ యువగళం చివరి రోజున గ్రేటర్ విశాఖపట్నం పరిధిలో పాదయాత్ర చేశారు. గాజువాక కణితి రోడ్డుపై ఉన్న భారీ గుంతను చూసి లోకేశ్ అక్కడ కాసేపు ఆగారు. దీనికి సంబంధించిన ఫొటోను లోకేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

"ఇది రాష్ట్రంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోని పాడుబడ్డ రహదారి కాదు. అక్షరాలా గ్రేటర్ విశాఖ పరిధిలో నిత్యం ట్రాఫిక్ తో రద్దీగా ఉండే స్టీల్ ప్లాంట్ సమీపంలోని గాజువాక కణితి రోడ్డు" అని వెల్లడించారు. 

ప్రజల నుంచి పన్ను మీద పన్ను వసూలు చేస్తూ కోట్లాది రూపాయలు దోచుకుంటున్న సైకో ప్రభుత్వం విశాఖ వంటి మెట్రో నగరాల్లో రోడ్ల మరమ్మతులు చేయకుండా గాలికి వదిలేసిందని లోకేశ్ విమర్శించారు. విశాఖ మహానగర రోడ్లపై తట్ట మట్టి కూడా పోయడం చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి... విశాఖను రాజధాని చేసేస్తానంటూ బిల్డప్ బాబాయ్ కబుర్లు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. 

10 కి.మీ దూరానికి కూడా హెలికాప్టర్ లో వెళ్లే అత్యంత సంపన్నుడైన ఈ ముఖ్యమంత్రికి నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు తెలుస్తాయా? ఆలోచించండి విశాఖ ప్రజలారా? అంటూ లోకేశ్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.
Nara Lokesh
Potholes
Visakhapatnam
Jagan
Yuva Galam Padayatra
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News