నాడు కాంగ్రెస్ నుంచి పీజేఆర్ తప్ప ఎవరూ మాట్లాడలేదు: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు కౌంటర్

Harish Rao praises PJR in assembly
షార్ట్స్‌లో చూడండి
కృష్ణా జల్లాల్లో తెలంగాణ వాటాపై పోరాడింది కాంగ్రెస్ పార్టీ నాయకులేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసన సభలో వ్యాఖ్యానించగా, ఆ మాటలకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. శనివారం సభలో హరీశ్ రావు మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. నాడు పోతిరెడ్డి ప్రాజెక్టును ఆపాలని బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) నేతలుగా తాము కోరామని, ఆ రోజు తాము 6 కారణాలతో రాజీనామా చేశామని తెలిపారు. అప్పుడు మంత్రులుగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఎవరూ మాట్లాడలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ నుంచి ఒక్క పీజేఆర్ తప్ప ఎవరూ పోతిరెడ్డిపై మాట్లాడలేదని తెలిపారు. ఆ రోజు మేం గెలిచి కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టామన్నారు. తమతో పొత్తు వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు.

నదీ జాలాలపై సీఎం చేసిన వ్యాఖ్యల రికార్డులను సరి చేయాలన్నారు. అప్పుడు 14 నెలలకే తాము వైఎస్ కేబినెట్ నుంచి బయటకు వచ్చామని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు, పులిచింతల, 610 జీఓ, బూటకపు ఎన్‌కౌంటర్‌లకు నిరసనగానే తాము కేబినెట్ నుంచి బయటకు వచ్చామన్నారు. నాడు మంత్రులుగా ఉన్న వారు పదవుల కోసం పెదవులు మూసుకున్నారు అంటూ విమర్శించారు.

ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ప్రజల తీర్పుతో అయినా బీఆర్ఎస్ వాస్తవాలను గ్రహించాలని సూచించారు. ఇందిరమ్మ రాజ్యంలోనే ఇళ్లు, భూములు వచ్చాయని, అధికారంలో లేనప్పుడు.. ఇప్పుడూ అదే చెబుతున్నామన్నారు. ఆనాడు మీరు ఎన్ని సీట్లలో నిలబడ్డారు? ఎన్ని గెలిచారు? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వల్ల తాము గెలిచామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. శ్రీధర్‌బాబు తనను కెలికారని... కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క రూపాయి ఇవ్వనుపో అన్న రోజున వీరెవరూ మాట్లాడలేదని మండిపడ్డారు.
Go Back to Shorts
Congress
Harish Rao
Revanth Reddy
telangana assembly sessions

More Telugu News