‘వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి భర్తీకి రోహిత్‌ శర్మకు ఇదే మంచి అవకాశం..’ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో రోహిత్ కీలకమవబోతున్నాడని విశ్లేషించిన సన్నీ
  • తన తర్వాతి స్థానాల్లో వచ్చే బ్యాటర్లను సెట్ చేయడంలో ముఖ్యపాత్ర పోషించనున్నాడని వ్యాఖ్య
  • టీమిండియా దక్షిణాఫ్రికా టూర్ మొదలుకానున్న నేపథ్యంలో మాజీ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా దక్షిణాఫ్రికా టూర్‌లో మ్యాచ్‌లు మొదలు కానున్న నేపథ్యంలో మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత కీలకమవబోతున్నాడని సన్నీ విశ్లేషించాడు. తన తర్వాత మూడు, నాలుగు, ఐదవ స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చే బ్యాటర్లను సెట్ చేయడంలో రోహిత్ శర్మ అత్యంత కీలకమైన పాత్ర పోషించాల్సి ఉందని అన్నాడు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమిని భర్తీ చేసుకునేందుకు రోహిత్ శర్మకు ఇదే మంచి అవకాశమని వ్యాఖ్యానించాడు. గత 6-8 నెలల నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఇద్దరూ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారని అన్నాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్‌తో గవాస్కర్ అన్నాడు.

ఇదిలావుంచితే.. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య ఆదివారం జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. టీ20 సిరీస్ అనంతరం వన్డేలు, ఆ తర్వాత డిసెంబర్ 26న తొలి టెస్టు మ్యాచ్ ఆరంభమవనుంది. టెస్టు సిరీస్‌లో టీమిండియాకు గట్టి పోటీ ఎదురుకానుంది. సౌతాఫ్రికాను వారి దేశంలో భారత్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌లో ఓడించలేదు. ఎనిమిది టెస్ట్ సిరీస్‌లు ఆడినప్పటికీ ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. టీమిండియా చివరిసారిగా 2021/22లో 2-1 తేడాతో సిరీస్‌ను చేజార్చుకుంది. 2017/18లో కూడా 2-1 తేడాతో భారత్ సిరీస్ ఓడిపోయింది. అయితే సిరీస్‌ డ్రా చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే టీ20, వన్డే సిరీస్‌ల కంటే టెస్టు మ్యాచ్‌లపైనే ఎక్కువ ఫోకస్ ఉంది.

Sunil Gavaskar
Rohit Sharma
Virat Kohli
Cricket
Team India
India vs South Africa

More Telugu News