బోట్లు నష్టపోయిన మత్స్యకారులకు ఆర్థిక సాయం అందించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan distributes cheques to fishermen who lost boats in fire accident
ఇటీవల విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో బోట్లు కాలిపోయి, తీవ్రంగా నష్టపోయిన మత్స్యకారులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ ఆర్థిక సాయం అందించారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ బాధిత మత్స్యకారులకు రూ.50 వేలు చొప్పున చెక్కులు అందించారు. అనంతరం పవన్ ప్రసంగించారు. ఇవాళ చాలా ప్రత్యేక పరిస్థితుల్లో విశాఖ వచ్చానని వెల్లడించారు. ఈ నెల 19న జరిగిన అగ్నిప్రమాదంలో బోట్లు దగ్ధం కావడం బాధాకరమని పేర్కొన్నారు. 

"నేనిచ్చే సొమ్ముతో బాధితుల కష్టాలు తీరిపోతాయని నేను నమ్మను. కానీ, మీకు కష్టం వస్తే పవన్ కల్యాణ్ ఉన్నాడు, జనసేన పార్టీ ఉంది, మా నేతలు ఉన్నారు, మా వీర మహిళలు ఉన్నారు, మా జన సైనికులు ఉన్నారు... సాటి మనిషిని ఆదుకునేవారు ఉన్నారనే భరోసా కల్పించడమే మా ఉద్దేశం. గతంలో కౌలు రైతులకు కూడా ఇలాగే సాయం చేశాం. ఇవాళ దాదాపు రూ.30 లక్షలు మత్స్యకార సోదరులకు అందించాం. ఇంతటితో మీ కష్టాలు తీర్చేశాను అని చెప్పను... కానీ మీ కష్టాల్లో, మీ కన్నీళ్లలో నేను కూడా భాగం పంచుకుంటాను అని మాత్రం చెప్పగలను. అందులో భాగంగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. 

ఇక్కడి హార్బర్ 1976లో ప్రారంభమైంది. 700 మరబోట్ల కార్యకలాపాలకు వేదికగా, రోజుకు ఐదు నుంచి పది వేల మంది వచ్చి బేరసారాలు జరిపే కేంద్రంగా ఉన్న హార్బర్ ఇది. వైసీపీ లాగా నేను మత్స్యకారులను ఎప్పుడూ ఓటు బ్యాంకుగా చూడలేదు. మత్స్యకారులు అంటే నా సోదరులుగానే భావిస్తాను. మీరు కష్టాల్లో ఉంటే నేను ఏం చేయగలనన్నది ఆలోచిస్తాను. 

ఇవాళ నేను... వచ్చే ఎన్నికల్లో ఓట్లు పడతాయన్న ఉద్దేశంతో రాలేదు. నిజంగా నేను అలాంటి వ్యక్తిని కాదు. మీరు కష్టంలో ఉన్నప్పుడు నేను అండగా ఉంటాను. ఓవైపు తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. తెలంగాణలో జనసేన పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేస్తోంది. ఆ కార్యక్రమాలు కూడా ఆపుకుని ఇక్కడికి ఎందుకు వచ్చానంటే... మీ కష్టాన్ని నా కష్టంగా భావించబట్టే! 

ఆ బోట్లలో పనిచేసే ప్రతి ఒక్క మత్స్యకారుడికి కూడా సాయం అందించాలని నాకు మనసులో ఉంది. భవిష్యత్తులో ఏమాత్రం అవకాశం వచ్చినా అందరికీ సాయం చేస్తాను. ఇంకొక్క నాలుగు నెలలు ఆగండి... ఇక్కడ భద్రతతో కూడిన హార్బర్ ను తీసుకువచ్చే బాధ్యత జనసేన తీసుకుంటుంది. వైసీపీని ఎదుర్కొనే క్రమంలో ఎలాంటి అవకాశాలు చేజార్చుకోరాదన్న ఉద్దేశంతోనే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం. 

ఎంత బలం ఉన్నా కానీ... 500 ఓట్లతో ఓడిపోయాం, 5 వేల ఓట్లతో ఓడిపోయాం అనే పరిస్థితి రాకూడదు. గెలిస్తే 25 వేల మెజారిటీతో గెలవాలి, 50 వేల ఓట్లతో గెలవాలి. త్రిముఖ పోటీ ఉంటే ఇలాంటి విజయాలు సాధ్యం కాదు. అందుకే టీడీపీతో చేయి కలిపాం. వైసీపీ మళ్లీ  అధికారంలోకి వస్తే ఇలాంటి బోటు ఘటనలు మళ్లీ జరుగుతాయి. చీకటి మూకలు మళ్లీ తయారవుతాయి" అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్దకు వెళ్లారు. అక్కడ బోట్లు దగ్ధమైన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Fishermen
Boats
Financial Help
Janasena
Visakhapatnam

More Telugu News