K Kavitha: ఎమ్మెల్యే షకీల్‌పై దాడికి యత్నం... తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత

  • ఎడపల్లి మండలంలో షకీల్ ప్రచారాన్ని అడ్డుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు
  • బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం... ఉద్రిక్తత
  • తనపై కాంగ్రెస్ నాయకులు హత్యాయత్నం చేశారని షకీల్ ఫిర్యాదు
  • కాంగ్రెస్ గూండాల దాడిని ఖండిస్తున్నామంటూ కవిత ఆగ్రహం
MLC Kavitha condemns attack on MLA Shakeel

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబంలో ఎమ్మెల్యే షకీల్ ప్రచారం నిర్వహిస్తుండగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సమయంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం సాటాపూర్ గేటు వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు షకీల్‌పై దాడికి ప్రయత్నించినట్లుగా బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. తనపై కాంగ్రెస్ నాయకులు హత్యాయత్నం చేశారని షకీల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

కాంగ్రెస్ గూండాల దాడిని ఖండిస్తున్నాం

షకీల్, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఓటమికి భయపడే బీఆర్ఎస్ శ్రేణులపై దాడికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఓటమి ఖాయమైందని, బీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కారణంగానే వారు దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. 60 లక్షల గులాబీ సైన్యం ముందు మీరెంత? సత్తా కలిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ దాడులను ప్రజాక్షేత్రంలో దీటుగా ఎదుర్కొంటారని పేర్కొన్నారు. ఇలాంటి దాడులకు తెగబడితే కాంగ్రెస్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కవిత డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News