బీఆర్ఎస్ పోరాటానికి భయపడి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది: కేసీఆర్

CM KCR praja ashirvada sabha in sirpur
  • సిర్పూర్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్
  • ఎన్నికలు వచ్చినప్పుడు ఆలోచించి ఓటేయాలని సూచన
  • పేదలు, రైతుల గురించి ఆలోచించే వారికి ఓటేయాలని సూచన
  • కాంగ్రెస్ పాలనలో 60 ఏళ్లు గోసపడ్డామన్న కేసీఆర్
ఎన్నికల్లో సేవ చేసే వ్యక్తికి ఓటు వేయాలని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సిర్పూర్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్నికలు వచ్చినప్పుడు ఆందోళన చెందవద్దని, ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. రైతులు, పేదల గురించి ఎవరు ఆలోచిస్తారో చూడాలన్నారు. 2004కు ముందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. పైగా ఎన్నికల తర్వాత మన పార్టీని చీల్చే ప్రయత్నం చేసిందన్నారు. పద్నాలుగేళ్ల పాటు పోరాడామని, బీఆర్ఎస్ పోరాటానికి భయపడి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నామన్నారు.

తెలంగాణ‌కు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసింద‌న్నారు. ఆ పార్టీ తీరుతో దాదాపు 60 ఏళ్లు గోసపడ్డామన్నారు. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర ప్రజలకు తెలుసునన్నారు. తెలంగాణ కోసం.. తెలంగాణ ప్రజల కోసం.. పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. పదేళ్లుగా ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నామో గమనించాలన్నారు. అభివృద్ధి ప్రజల కళ్ళముందే ఉందన్నారు. యాభై ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశమిస్తే చేసిందేమీ లేదన్నారు. అభ్యర్థుల గుణగణాలు, సేవాతత్వం, పార్టీ గురించి ఆలోచించి ఓటేయాలన్నారు. ఎన్నికలు అయిపోగానే సరిపోదని... ఆయా నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలను బట్టి ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. కాబట్టి ఆలోచించి ఓటును వేయాలన్నారు.
Go Back to Shorts
KCR
BRS
Congress
Telangana Assembly Election

More Telugu News