ఈ ఫొటోకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది: సచిన్

Sachin has shared his childhood photo
  • ముంబయి వాంఖెడే స్టేడియంలో సచిన్ విగ్రహం
  • బుధవారం నాడు విగ్రహావిష్కరణ
  • వాంఖెడేతో తన అనుబంధాన్ని వివరించిన మ్యాస్ట్రో
ముంబయి వాంఖెడే స్టేడియంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహావిష్కరణ జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై సచిన్ సోషల్ మీడియాలో స్పందించాడు. తన చిన్ననాటి ఫొటోను పంచుకుని భావోద్వేగ వివరణ ఇచ్చాడు. 

"ఈ ఫొటోకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. నేను 10 ఏళ్ల బాలుడిగా ఉన్నప్పటి ఫొటో ఇది. నాడు 25 మంది ఉంటే చేతిలో ఉన్నది 24 టికెట్లే. ఆ బృందంలో ఒకడిగా వాంఖెడే స్టేడియం నార్త్ స్టాండ్ లో దొంగచాటుగా అడుగుపెట్టినప్పటి నుంచి ఇవాళ అదే స్టేడియంలో నా విగ్రహం ఆవిష్కరించే వరకు నా క్రికెట్ జీవితం ఎన్నో మలుపులు తిరిగి... తిరిగి ఇక్కడికే వచ్చింది. ఆ రోజు మేం మ్యాచ్ చూడ్డానికి వచ్చినప్పుడు మా బృందం చేసిన హంగామా, ఆ ఆనందం ఇప్పటికీ నాకు గుర్తుంది. నా క్రికెట్ కెరీర్ ఆసాంతం నార్త్ స్టాండ్ గ్యాంగ్ అందించిన మద్దతు ఎనలేనిది. 

ఒక్కసారి ఆలోచిస్తే... మొదట ఓ క్రికెట్ అభిమానిగా వాంఖెడేలో అడుగుపెట్టాను. ఆ తర్వాత 1987 వరల్డ్ కప్ లో బాల్ బాయ్ గా సేవలందించాను. 2011లో ఇదే మైదానంలో వరల్డ్ కప్ విజేతగా నిలిచాను. అంతెందుకు, నా కెరీర్ లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది కూడా వాంఖెడేలోనే. ఈ ప్రస్థానాన్ని మాటల్లో వర్ణించలేను. 

ఇక, ఈ విగ్రహం నా ఒక్కడిదే అనుకోవడంలేదు. ఇది నా కెరీర్ లో సహకరించిన ప్రతి ఒక్క నాన్ స్ట్రయికర్ కు అంకితం, ప్రతి టీమ్ మేట్ కు అంకితం, ప్రతి సహచరుడికి అంకితం, నా పక్షాన నిలిచిన ప్రతి ఒక్కరికీ అంకింతం. వారు లేకుండా ఇంతటి ఘనతర ప్రస్థానం సాధ్యం కాని పని. వాంఖెడే, క్రికెట్... మీరెంత మంచివాళ్లు!" అంటూ సచిన్ తన మనోభావాలను పంచుకున్నాడు.
Go Back to Shorts
Sachin Tendulkar
Photo
Wankehede
Northstand

More Telugu News