భూవివాదం.. దారుణ హత్య.. నిందితుడి ఇంటికి నిప్పు
- చంద్రగిరి నియోజకవర్గం అడపారెడ్డిపల్లి గ్రామంలో ఘటన
- అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తిని గొంతు కోసి చంపిన నిందితుడు
- హత్య తర్వాత నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన మృతుడి బంధువులు
- గ్రామంలో ఉద్రిక్తత, భారీగా పోలీసుల మోహరింపు
- నిందితుడు పరారీలో ఉన్నాడని, గాలిస్తున్నామని చెప్పిన పోలీసులు
వివరాల్లోకి వెళితే, తిరుపతి గ్రామీణ మండలం అడపారెడ్డి పల్లి గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డి (45)కి, అదే గ్రామంలో నివసించే బొమ్మి రాహుల్ రెడ్డికి మధ్య చాలా కాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ఇరువర్గాల మధ్య గొడవ జరగడంతో రాహుల్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిపై దాడి చేసి గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది.
అమర్నాథ్ రెడ్డి హత్య విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహంతో రగిలిపోయారు. నిందితుడు రాహుల్ రెడ్డి ఇంటితో పాటు అతని మోటార్సైకిల్కు నిప్పుపెట్టారు. దీంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ఎం.ఆర్.పల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
హత్య జరిగినప్పటి నుంచి నిందితుడు రాహుల్ రెడ్డి తన కుటుంబంతో పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.