IPhone Message: యాపిల్ కంపెనీకి కేంద్రం నోటీసులు

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ కు కేంద్ర ప్రభుత్వం గురువారం నోటీసులు పంపించింది. కేంద్ర ప్రభుత్వంపై చేసిన హ్యాకింగ్ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రతిపక్ష నేతల ఫోన్లలో మాల్ వేర్ చొప్పించేందుకు ప్రయత్నించిందని ఎలా నిర్ధారించారని ప్రశ్నించింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఉన్న ఆధారాలు ఏంటని, వాటిని అప్పగించాలని కేంద్ర ఐటీ శాఖ ఈ నోటీసుల్లో పేర్కొంది. 

తమ ఫోన్లను కేంద్ర ప్రభుత్వం హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష నేతలు శశిథరూర్, మహువా మొయిత్రాలతో పాటు పలువురు నేతలు ఇటీవల ఆరోపించారు. మహువా మొయిత్రా ఈ విషయంపై స్పీకర్ కు ఓ లేఖ కూడా రాశారు. ఈమేరకు యాపిల్ కంపెనీ నుంచి వచ్చిన అలర్ట్ మెసేజ్ లను మొయిత్రా బయటపెట్టారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు కూడా ఈ అలర్ట్ మెసేజ్ వచ్చినట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్ మాజీ చీఫ్, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.

ప్రతిపక్ష నేతల ఆరోపణలపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ స్పందించారు. యాపిల్ కంపెనీ మొత్తం 150 దేశాల్లోని తన కస్టమర్లకు ఇలాంటి హెచ్చరిక సందేశాలు పంపించిందని వివరించారు. ఇలాంటి సందేశాలు ఒక్కోసారి పొరపాటున కూడా వస్తాయని చెప్పారు. ఈ విషయంపై యాపిల్ కంపెనీ వివరణ కోరతామని, ఆ కంపెనీ దగ్గరున్న ఆధారాలతో దర్యాఫ్తు జరిపిస్తామని మంత్రి పేర్కొన్నారు.
IPhone Message
Apple company
IT Ministry
notice to Apple
Mobile Hackinig

More Telugu News