నేను బికినీ వేసుకున్న ఫొటో గురించి ఇంత దారుణంగా స్పందిస్తారా?: సుబ్రహ్మణ్యస్వామిపై కంగనా రనౌత్ ఫైర్

ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమానికి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముఖ్య అతిథిగా హాజరయింది. రావణ దహనం చేసిన తొలి మహిళగా కంగన చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ గతంలో కంగన ధరించిన బికినీ ఫొటోను షేర్ చేసింది. మోదీ ప్రభుత్వాన్ని ఎంటర్టైన్ చేస్తున్న లేడీ అంటూ కామెంట్ చేసింది. ఈ ట్వీట్ పై బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి స్పందిస్తూ కంగనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కంగనను రావణ దహనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారంటే ఆమెకు ఎంత గౌరవం ఇస్తున్నారో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. కంగన కోసం ఎస్పీజీ కాస్త ఎక్కువగానే స్పందిస్తోందని అన్నారు. ఇది ఒక గౌరవం లేని సంస్థ అని విమర్శించారు. 

ఈ వ్యాఖ్యలపై కంగన ఫైర్ అయింది. తన శరీరాన్ని ఉపయోగించుకునే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు అనుకుంటున్నారని ఆమె మండిపడింది. తన స్విమ్ సూట్ ఫొటో గురించి ఇంత నీచంగా మాట్లాడారంటే... ఆయన స్వభావం ఏమిటో అర్థమవుతోందని అన్నారు. మహిళల విషయంలో ఆయన వక్రబుద్ధి అర్థమవుతోందని దుయ్యబట్టారు. తన స్థానంలో ఒక యువకుడు ఉంటే ఇలా మాట్లాడేవారా? అని ప్రశ్నించారు. స్త్రీలు కేవలం సెక్స్ కోసం మాత్రమే కాదని... వారికి కూడా మెదడు, గుండె, చేతులు, పాదాలు వంటి అవయవాలు కూడా ఉన్నాయని చెప్పారు. పురుషుడి మాదిరే గొప్ప నేతగా ఎదగడానికి అవసరమైన అన్ని అర్హతలు మహిళలకు ఉన్నాయని అన్నారు.

Kangana Ranaut
Bollywood
Subramanian Swamy

More Telugu News