ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ నుంచి పిలుపు.. సాయంత్రం కీలక భేటీ!

  • ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలతో భేటీ కానున్న కేసీఆర్
  • జిల్లాలో పార్టీ పరిస్థితిపై చర్చించనున్న సీఎం
  • తుమ్మల అంశంపై చర్చించే అవకాశం
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలకు అధిష్ఠానం నుంచి పిలుపు వెళ్లింది. వెంటనే హైదరాబాద్ కు రావాలని వారికి ఆదేశాలు అందాయి. వీరితో ఈ సాయంత్రం పార్టీ అధినేత కేసీఆర్ భేటీ కానున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై కేసీఆర్ లోతుగా చర్చించే అవకాశం ఉంది. తుమ్మల అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

మరోవైపు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయబోయే బీఆర్ఎస్ అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొందరు సిట్టింగ్ లకు మినహా దాదాపు అందరికీ ఆయన సీట్లను ఖరారు చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు వంటి వారికి టికెట్ దక్కక పోవడం చర్చనీయాంశంగా మారింది. 

తనకు టికెట్ రాకపోవడంపై తుమ్మల ఆవేదనకు గురయ్యారు. జిల్లా ప్రజల కోసం తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. నిన్న ఆయన ఖమ్మంలో బలప్రదర్శన చేశారు. కేసీఆర్ ఫొటో, బీఆర్ఎస్ జెండా లేకుండానే ఆయన కార్యక్రమం కొనసాగింది. ఇంకోవైపు, కాంగ్రెస్ తరపున పోటీ చేయాలంటూ తుమ్మలపై ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, ఆయన కాంగ్రెస్ తరపున పోటీ చేస్తారా? లేక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.

KCR
BRS
Khammam District
Thummala

More Telugu News