ఏపీలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే వైసీపీ క్లీన్ స్వీప్: టైమ్స్ నౌ సర్వేలో వెల్లడి

  • వైసీపీకి 24 నుంచి 25 పార్లమెంట్ సీట్లు వస్తాయన్న సర్వే
  • టీడీపీకి ఒకటి లేదా సున్నా సీట్లు వస్తాయని అంచనా
  • జూన్ 15 నుంచి ఆగస్ట్ 12 వరకు సర్వే చేసిన టైమ్స్ నౌ
వచ్చే ఏడాది ఏప్రిల్ - మే నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో దేశ వ్యాప్తంగా అప్పుడే ఎన్నికల హడావుడి నెలకొంది. దీంతో పాటు ఈ డిసెంబర్ లోపల పలు కీలక రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. మరోవైపు ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఎవరి నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నారు? అనే అంశాలపై పలు మీడియా సంస్థలు సర్వేలు చేపడుతూ, ఆసక్తికర అంచనాలను వెలువరిస్తున్నాయి. తాజాగా, టైమ్స్ నౌ తన సర్వే వివరాలను వెల్లడించింది. 

ఏపీలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని టైమ్స్ నౌ సర్వేలో తేలింది. టీడీపీ, జనసేన ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని సర్వే అంచనా వేసింది. మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు గాను వైసీపీకి 24 నుంచి 25 సీట్లు రావచ్చని తెలిపింది. టీడీపీకి ఒక్క సీటు రావచ్చని... లేకపోతే ఆ ఒక్క సీటు కూడా రాకపోవచ్చని వెల్లడించింది. జనసేన ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది. జూన్ 15 నుంచి ఆగస్ట్ 12వ తేదీ మధ్య ప్రజల అభిప్రాయాలను సేకరించినట్టు తెలిపింది. గత లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ 22 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. టైమ్స్ నౌ తాజా సర్వేను పరిశీలిస్తే వైసీపీ మరింత బలపడబోతోంది.

AP Election Survey
Times Now Survey
YSRCP
Telugudesam
Janasena

More Telugu News