దర్శి నియోజకవర్గంలో లోకేశ్ కు తప్పిన ప్రమాదం... ఏమైందంటే...!

  • దర్శి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • భారీగా తరలివచ్చిన జనాలు
  • ఒక్కసారిగా తీవ్ర తోపులాట
  • మూడుసార్లు కిందపడబోయిన లోకేశ్
  • వ్యక్తిగత భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో తప్పిన ప్రమాదం
  • లోకేశ్ పాదయాత్రపై వైసీపీ పెద్దల కుట్ర అంటూ టీడీపీ ఆగ్రహం
ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ప్రమాదం తప్పింది. దర్శి నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా జనం ఒక్కసారిగా మీదపడడంతో లోకేశ్ ఉక్కిరిబిక్కిరయ్యారు. 

ప్రజలు భారీగా తరలిరావడంతో తోపులాట అధికమైంది. ఈ నేపథ్యంలో, లోకేశ్ మూడుసార్లు కిందపడే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వ్యక్తిగత భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో లోకేశ్ కు ప్రమాదం తప్పింది. 

ఈ ఘటనపై టీడీపీ తీవ్రంగా స్పందించింది. జనాన్ని అదుపు చేయడంలో పోలీసు శాఖ విఫలమవుతోందని విమర్శించింది. పోలీసులు కావాలనే లోకేశ్ కు భద్రత కల్పించడంలేదని తీవ్ర ఆరోపణ చేసింది. వైసీపీ పెద్దల ఒత్తిడితోనే లోకేశ్ పాదయాత్రకు భద్రత తగ్గించారని టీడీపీ మండిపడింది. కందుకూరు, గుంటూరు తరహా ఘటనలు మరోసారి జరిగేలా కుట్ర పన్నుతున్నారని ఆరోపించింది. 

జనం తోపులాటల్లో లోకేశ్ కాళ్లకు, చేతులకు తరచుగా గాయాలవడం పట్ల తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది.

Nara Lokesh
Darsi
Yuva Galam Padayatra
TDP
Police

More Telugu News