గంటన్నర ముందుగా వచ్చి, ప్రయాణికులను వదిలేసి వెళ్లిపోయిన రైలు!

Goa express arrives 90 minutes leaves without 45 passengers
  • 90 నిమిషాల ముందుగా మన్మాడ్ జంక్షన్‌కు చేరుకున్న గోవా ఎక్స్‌ప్రెస్ 
  •  ఆ తరువాత అయిదు నిమిషాలకే స్టేషన్‌ను వీడిన వైనం
  • రైలును మిస్సయిన 45 మంది ప్రయాణికులు
  • మరో రైల్లో వారిని జల్గావ్‌కు పంపించిన అధికారులు
  • అక్కడి నుంచి గోవా ఎక్స్‌ప్రెస్‌లో గమ్యస్థానాలకు చేరుకున్న ప్రయాణికులు 
రైళ్లు, బస్సులు, విమానాలు సాధారణంగా సమయానికి వస్తాయి లేదంటే కాస్తంత అలస్యంగా వస్తాయి. కానీ ఓ రైలు ఏకంగా గంటన్నర ముందుగా వచ్చేసింది. ఇది చాలదన్నట్టు 45 మంది ప్రయాణికులను వదిలేసి మరీ వెళ్లిపోయింది. మహారాష్ట్రలో ఈ ఘటన చోటుచేసుకుంది. వాస్కోడగామా-హజ్రత్ నిజాముద్దీన్ గోవా ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ ప్రకారం గురువారం 10.35 గంటలకు మన్మాడ్ జంక్షన్‌కు రావాల్సి ఉంది. అయితే, దీనిని మరో మార్గంలో మళ్ళించడం వల్ల రైలు గంటన్నర ముందుగానే స్టేషన్‌కు చేరుకుంది. ఇది చాలదన్నట్టు కేవలం అయిదు నిమిషాల పాటే స్టేషన్‌లో ఆగి, వెళ్లిపోయింది. 

అప్పటికి స్టేషన్ చేరుకోని 45 మంది ప్రయాణికులు రైలును మిస్సయ్యారు. ఆ తరువాత స్టేషన్‌కు వచ్చిన వారికి విషయం తెలిసి స్టేషన్ మేనేజర్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. దీంతో, అధికారులు వీరిని మన్మాడ్ స్టేషన్‌ నుంచి గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌లో జల్గావ్‌కు పంపించారు. వారు అక్కడకు చేరుకునే వరకూ గోవా ఎక్స్‌ప్రెస్ ను ఆపేశారు. దీంతో, ప్రయాణికులందరూ ఎటువంటి ఇబ్బందీ లేకుండా తమ తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. రైల్వే సిబ్బంది పొరపాటు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఘటనపై విచారణ ప్రారంభించామని వెల్లడించారు.
Advertisement
Maharashtra
Goa Express

More Telugu News