నందిని పాల ధర పెంపుపై డీకే శివకుమార్ వివరణ ఇదే

  • లీటర్ నందిని పాల ధరను రూ. 3 చొప్పున పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం
  • పాడి రైతులకు మేలు చేసేందుకేనన్న డీకే శివకుమార్
  • పాల ధర కర్ణాటకలోనే తక్కువగా ఉందని వ్యాఖ్య
కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ధరల పెంపు కార్యక్రమాలను ప్రారంభించింది. తాజాగా నందిని పాల ధరను పెంచింది. లీటరు పాల ధరను రూ. 3 చొప్పున పెంచింది. దీంతో ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పాల ధర పెంపును ఆయన సమర్థించుకున్నారు. పాడి రైతులకు సాయపడేందుకే ధరను పెంచామని చెప్పారు.

 దేశ వ్యాప్తంగా లీటర్ పాల ధర రూ. 50 నుంచి రూ. 56 వరకు ఉందని... కర్ణాటకలో మాత్రం తక్కువగా ఉందని... అందుకే లీటర్ ధరను రూ. 3 చొప్పున పెంచి రైతులకు సాయపడాలని నిర్ణయించామని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నందిని వర్సెస్ అమూల్ అనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. కర్ణాటకకు చెందిన నందిని పాలను దెబ్బ తీసేందుకే అమూల్ పాలను తీసుకొచ్చేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది.

DK Shivakumar
Karnataka
Nandini Milk

More Telugu News