అమ్మఒడి డబ్బులు పడలేదు.. జగన్‌పై చెక్‌బౌన్స్‌ కేసు పెడతాం: బీటెక్ రవి

  • సగం మంది లబ్ధిదారుల ఖాతాల్లో అమ్మఒడి పడలేదన్న బీటెక్ రవి
  • సీఎం జగన్ బటన్ నొక్కి చాలా రోజులు గడుస్తోందని సెటైర్
  • డబ్బులు పడనివారి వివరాలను సేకరించి స్టేషన్‌లో కేసు పెట్టనున్నట్లు వెల్లడి
ఏపీ సీఎం జగన్‌పై చెక్‌బౌన్స్‌ కేసు పెడతామని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి చెప్పారు. ఇప్పటికీ సగం మంది లబ్ధిదారుల ఖాతాల్లో అమ్మఒడి డబ్బులు పడలేదని ఆరోపించారు. వైఎస్‌ఆర్‌ జిల్లా వేములలో చక్రాయపేట, వేముల మండల టీడీపీ నాయకుల శిక్షణ కార్యక్రమంలో బీటెక్‌ రవి మాట్లాడారు. 

పంటల పరిహారం డబ్బులు కూడా చాలా మంది రైతులకు జమ కాలేదని ఆయన ఆరోపించారు. నిధులు విడుదల చేశామని సీఎం చెప్పినా.. ఇంకా డబ్బులు ఎందుకు పడలేదని ప్రశ్నించారు. సీఎం జగన్ బటన్ నొక్కి చాలా రోజులు గడుస్తున్నా సగం మంది అకౌంట్లలో డబ్బులు జమ కాలేదని చెప్పారు.

పంటలకు ఇన్సురెన్స్ డబ్బులు ఇచ్చినట్టుగా చెబుతున్నారని.. ఇంకా చాలా మందికి ఆ డబ్బులు కూడా పడలేదని అన్నారు. ‘‘ఎవరి దగ్గరినైనా అప్పు తీసుకుంటే.. వారి నుంచి చెక్ తీసుకుని బ్యాంకులో వేస్తాం. ఒకవేళ చెక్ బౌన్స్‌ అయితే వెళ్లి చెక్ బౌన్స్ కేసు పెడతాం. సీఎం జగన్ అమ్మ ఒడి పథకం నిధులు విడుదల చేస్తున్నానని బటన్ ఒత్తి ఇన్ని రోజులు గడుస్తున్నా డబ్బులు పడలేదు. మా నియోజకవర్గంలో ఈరోజు, రేపు కూడా డబ్బులు పడనివారి వివరాలను సేకరించి వాళ్ల తరఫున జగన్ మీద పోలీసు స్టేషన్‌లో చెక్ బౌన్స్ కేసు పెట్టబోతున్నాం’’ అని అన్నారు.


More Telugu News

btech ravi Jagan Telugudesam YSRCP