ఇండియాలో ఎవరితోనైనా, ఎక్కడైనా ఆడేందుకు సిద్ధం: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్

  • అక్టోబర్ 15న ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్
  • ఇండియాకు వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామన్న బాబర్
  • క్రికెట్ మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా వెళ్లేందుకు తాము సిద్ధమని వ్యాఖ్య

వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5న ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. 2012 నుంచి ఇటు ఇండియాలో కానీ, అటు పాకిస్థాన్‌లో కానీ ఈ రెండు జట్లు తలపడలేదు. తటస్థ వేదికలపైనే ఆడాయి. 

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ స్పందిస్తూ... ఇండియాలో జరగనున్న వరల్డ్‌కప్‌కు వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతిని కోరినట్టు చెప్పాడు. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నాడు. తాము ప్రపంచ కప్ ఆడేందుకు ఇండియాకు వెళ్తున్నామని... భారత్ పై ఆడేందుకు మాత్రమే వెళ్లడం లేదని స్పష్టం చేశాడు. ఒక జట్టుపై మాత్రమే తాము ఫోకస్ చేయడం లేదని, అక్కడ మరో తొమ్మిది జట్లు ఉంటాయన్నాడు. ప్రత్యర్థి జట్లు అన్నింటినీ ఓడించినప్పుడే తాము ఫైనల్స్ కు చేరుతామని పేర్కొన్నాడు. 

ప్రొఫెషనల్ ఆటగాళ్లుగా అన్ని సవాళ్లకు తాము సిద్ధంగా ఉండాలన్నాడు. ప్రపంచంలో క్రికెట్ మ్యాచ్ లు ఎక్కడ జరిగినా వెళ్లి ఆడేందుకు తాము సిద్ధమన్నాడు. ఇండియాలో ఎక్కడైనా, ఎవరితోనైనా ఆడేందుకు రెడీగా ఉన్నామని చెప్పుకొచ్చాడు.

Babar Azam
Pakistan
India
ODI World Cup

More Telugu News