'ముఖ్యమంత్రి జగన్‌తో ఎవరైనా ఆ సినిమా తీస్తారని ఆశిస్తున్నా'నంటూ పవన్ సెటైర్లు

  • 'పాపం పసివాడు' పోస్టర్‌‌ను షేర్ చేసి, ఏపీ సీఎంపై విమర్శలు
  • జగన్ కు వర్గయుద్ధం అనే పదం పలికే హక్కు కూడా లేదని ఎద్దేవా
  • ఏదో రోజు ఆయన నుంచి రాయలసీమకు విముక్తి లభిస్తుందన్న పవన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను అమాయకుడిని అని చెప్పుకుంటున్న జగన్ తో ఎవరైనా ‘పాపం పసివాడు’ సినిమా తీస్తారని ఆశిస్తున్నానని ఎద్దేవా చేశారు. ఈ మేరకు పాపం పసివాడు పోస్టర్ ను షేర్ చేస్తూ ట్వీట్టర్ లో జగన్ పై విమర్శలు గుప్పించారు. 

‘మన ఏపీ సీఎంతో ఎవరైనా ఈ సినిమా తీస్తారని ఆశిస్తున్నాను. ఆయన చాలా అమాయకుడు. అమాయకుడిని అని చెప్పుకొనే రాజకీయ నాయకుడు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మార్పు మాత్రమే అవసరం. ఆయన చేతిలో సూట్‌కేస్ బదులుగా, అక్రమ సంపద కోసం మనీలాండరింగ్‌ను సులభతరం చేసే బహుళ సూట్‌కేస్ కంపెనీలను ఉంచండి’ అని పవన్ ట్వీట్ చేశారు. 

అక్రమ సంపాదన, హింసతో రెచ్చిపోతున్నారని జగన్ కు వర్గ యుద్ధం అనే పదాన్ని కూడా ఉచ్చరించే హక్కు లేదన్నారు. ‘ప్రియమైన ఏపీ సీఎం గారు, మీరేమీ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డిలు కాదు. అక్రమ సంపాదనతో, ప్రజలపై హింస సాగిస్తున్న మీకు వర్గయుద్ధం అనే పదాన్ని ఉచ్చరించే హక్కు కూడా లేదు. ఏదో ఒక రోజు రాయలసీమ మీ నుంచి, మీ గుంపు బారి నుంచి విముక్తమవుతుందని ఆశిస్తున్నాను’ అని పవన్ పేర్కొన్నారు. "ఇక ఈ సినిమా కథకు రాజస్థాన్ ఎడారులు కావాలి. కానీ, వైసీపీ మన ఏపీ లోని నదీ తీరాల నుంచి ఇసుక దోచేసింది. కలెక్షన్ పాయింట్లలో తగినంత ఇసుక దిబ్బలు ఉన్నాయి.. చీర్స్" అంటూ పవన్ ఎద్దేవా చేశారు.


More Telugu News

Andhra Pradesh YS Jagan Pawan Kalyan YSRCP Janasena