కర్ణాటకలో అధికారంలోకి వచ్చేది ఎవరు? .. ఇండియా టుడే - సీ ఓటర్ సర్వే ఫలితాలు
- ఈ నెల 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు
- బీజేపీకి 74 - 86 సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడి
- కాంగ్రెస్ కు 107 - 119 స్థానాలు వస్తాయని తేల్చిన సర్వే
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని ఇండియా టుడే - సీఓటర్ సర్వేలో తేలింది. 224 సీట్లకు గాను బీజేపీ కేవలం 74 నుంచి 86 స్థానాలకే పరిమితమవుతుందని సర్వే తెలిపింది. 2018లో బీజేపీ సాధించిన సీట్ల కంటే 24 వరకు తక్కువ సీట్లు వస్తాయని తేలింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 107 నుంచి 119 వరకు సీట్లను గెలుస్తుందని సర్వే వెల్లడించింది. జేడీఎస్ 23 నుంచి 35 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది.
ఈ ఎన్నికల్లో నిరుద్యోగం (31 శాతం), మౌలికవసతుల కల్పన (24 శాతం), విద్యా వ్యవస్థలో మెరుగైన సౌకర్యాలు (14 శాతం), అవినీతి (13 శాతం) కీలక పాత్రను పోషించబోతున్నాయి.