Etela Rajender: రేవంత్ రెడ్డి ప్రమాణంపై ఈటల రాజేందర్ ఏమన్నారంటే...!

తాను ఎవరి పైనా వ్యక్తిగతంగా మాట్లాడలేదని, రూ.25 కోట్లు అంటూ ఆరోపణలు చేసింది న్యాయం కోసం, ధర్మం కోసమేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కేసీఆర్ నుండి కాంగ్రెస్ పార్టీకి రూ.25 కోట్లు వచ్చాయని ఈటల రాజేందర్ ఇటీవల ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి తమకు అధికార పార్టీ నుండి ఏ డబ్బులూ ముట్టలేదని, అలా అని తాను భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద ప్రమాణ స్వీకారం చేస్తానని సవాల్ చేశారు. శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఈ ఆలయానికి వచ్చిన రేవంత్ తమకు డబ్బు ముట్టలేదంటూ ప్రమాణం చేశారు.

రేవంత్ ప్రమాణంపై ఈటల స్పందించారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే వ్యక్తిని కాదన్నారు. తాను సింగరేణి అంశంపై పెట్టిన ప్రెస్ మీట్ సమయంలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానన్నారు. గుడికి వెళ్లి అమ్మతోడు... అయ్యతోడు అనడం ఏమిటన్నారు. తాను కూడా ఆత్మసాక్షిగా చెబుతున్నానని అన్నారు. 

రాజకీయ నాయకుడు అంటే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. తనను సవాల్ చేసిన వారు ఏం మాట్లాడతారో చూశాక.. అన్నింటి పైన స్పందిస్తానని చెప్పారు. అవసరమైతే రేపు మాట్లాడుతానని అన్నారు.
Etela Rajender
Revanth Reddy

More Telugu News