Kambhampati Rammohan Rao: జగన్ ఆస్తులతో అలాంటి పథకం నెలకొకటి ఇవ్వొచ్చు: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

Chandrababu will become cm agains rammohan naidu
షార్ట్స్‌లో చూడండి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్ద ఉన్న ఆస్తులతో మన రాష్ట్రంలో నెలకో వసతి దీవెన ఇవ్వవచ్చునని లోక్ సభ సభ్యుడు, తెలుగు దేశం పార్టీ నేత రామ్మోహన్ నాయుడు అన్నారు. నేడు (ఏప్రిల్ 20, గురువారం) టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మాట్లాడుతూ, చంద్రబాబు అమలు చేసిన ఎన్నో సంస్కరణలను దేశంలోని చాలామంది నేతలు ఆచరణలో పెట్టారన్నారు. ఆయన పాలనను, అభివృద్ధిని మోడల్ గా తీసుకున్నట్లు చెప్పారు. వాజపేయి కూడా ప్రధానిగా ఉన్న సమయంలో చంద్రబాబు సలహాలు తీసుకునే వారని చెప్పారు.

జగన్ పాలనలో ఆంధ్ర ప్రదేశ్ దివాలా తీసిందని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయగల నాయకుడు చంద్రబాబు మాత్రమేనని ప్రజలు చెప్పుకుంటున్నారన్నారు. గత టీడీపీ హయాంలోనే బావనపాడు పోర్టు కోసం అనుమతులు తీసుకు వస్తే, జగన్ ఈ నాలుగేళ్ల పాటు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. పోర్టు శంకుస్థాపన కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని విమర్శించారు. పోర్టును మార్చారని, ఊరిని మార్చారని, అసలు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. శ్రీకాకుళం - ఆమదాలవలస రోడ్డు పరిస్థితి ఏమిటో చెప్పాలన్నారు. తాము డబ్బులు శాంక్షన్ చేస్తే, నాలుగేళ్లయినా ప్రభుత్వం రోడ్డు వేయలేకపోయిందన్నారు.

జగన్ హామీలు పేపర్లో రాసుకోవడానికి తప్ప ఏమీ చేయడం లేదన్నారు. భోగాపురం విమానాశ్రయం కూడా మరో కొత్త డ్రామా అని ధ్వజమెత్తారు. విశాఖ రాజధాని అంటే ప్రజలు నమ్మడం లేదని, అందుకే విమానాశ్రయాన్ని తెరపైకి తీసుకు వచ్చారన్నారు. దేశంలోనే ధనిక సీఎం జగన్ అని, ఆయన ఆస్తులతో నెలకో వసతి దీవెన ఇవ్వవచ్చునని చెప్పారు. కోడి కత్తితో ఆస్కార్ తరహా డ్రామాను రక్తి కట్టించారన్నారు. తల్లిని, చెల్లిని దూరం చేసుకున్నారని, మరో చెల్లి సునీతమ్మను కూడా తనంతట తాను దూరం చేసుకొని, ఒంటరివాడినని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం జగన్ చేసిందేమీ లేదన్నారు. కానీ ఇప్పుడు ఎంపీ అవినాశ్ రెడ్డి కోసం మాత్రం ఢిల్లీకి పరుగెడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ విశాఖకు వస్తున్నానని చెబుతున్నారంటే కబ్జాల కోసమే అన్నారు. మూడు రాజధానులు ముగిసిన అధ్యాయమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Kambhampati Rammohan Rao
Srikakulam District
YS Jagan
Chandrababu

More Telugu News