తెలంగాణలో భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు

  • వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రంపై భానుడి ప్రతాపం
  • 4 డిగ్రీల వరకూ గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల
  • 12,13 తేదీల్లో రాష్ట్రం వ్యాప్తంగా భారీస్థాయికి గ్రీష్మతాపం
తెలంగాణాపై భానుడు తన ప్రతాపం చూపనున్నాడు. వచ్చే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకూ పెరిగే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఆ తరువాత రాష్ట్రమంతటా గ్రీష్మతాపం భారీ స్థాయికి చేరుకుంటుందని తెలిపింది. 

ఈ నేపథ్యంలో అధికారులు పలు జిల్లాలకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. నేడు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయ్‌శంకర్ భూపాలపల్లి, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో.. 11న ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 12, 13 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రత భారీగా పెరగనుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా పెద్ద అడిసెర్లపల్లి మండలం ఘన్‌పూర్‌లో అత్యధికంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Telangana

More Telugu News