తెలంగాణ కుటుంబ పాలనలో అంతా అవినీతే.. కఠిన చర్యలు తప్పవు: మోదీ హెచ్చరిక
- కేంద్ర పథకాలకు తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదన్న మోదీ
- తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమయిందని వ్యాఖ్య
- కుటుంబ పాలన తెలంగాణలో అవినీతిని పెంచి పోషిస్తోందని విమర్శ
- కుటుంబ పాలనకు చరమగీతం పలుకుదామని పిలుపు
- కుటుంబ పాలన ఉన్నచోట అవినీతి మొదలవుతుందన్న ప్రధాని
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, రాష్ట్ర అభివృద్ధిని కొందరు అడ్డుకుంటున్నారని, అందుకు అభివృద్ధిలో ఆలస్యం జరుగుతోందని చెప్పారు. తెలంగాణలో కుటుంబ పాలన, ఆ కుటుంబ అవినీతి పెరిగిపోతోందని అన్నారు. కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలగాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ప్రారంభమైందని అన్నారు. అవినీతిని అణచివేస్తున్న తనపై పోరాడటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయని చెప్పారు.
తెలంగాణలో కుటుంబ పాలనతో అవినీతిని పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. అవినీతిపరులపై కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిజాయతీగా పని చేసేవారు ఈ కుటుంబ పాలకులకు నచ్చడం లేదని విమర్శించారు. తెలంగాణలో ఉన్న కుటుంబ పాలన అన్ని వ్యవస్థలు తన గుప్పిట్లో ఉండాలని భావిస్తోందని మండిపడ్డారు. అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. ఎక్కడైతే కుటుంబ పాలన ఉంటుందో అక్కడ అవినీతి మొదలవుతుందని చెప్పారు. విచారణ సంస్థలను కూడా బెదిరించే స్థాయికి కుటుంబ పాలకులు వచ్చారని మండిపడ్డారు. కుటుంబ పాలనకు చరమగీతం పలుకుదామని పిలుపునిచ్చారు.