Google layoffs: ఏకమైన గూగుల్ ఉద్యోగులు.. సీఈఓ సుందర్ పిచాయ్‌కు బహిరంగ లేఖ

google employees write an open letter to Google Ceo sudar pichai

  • పిచాయ్‌‌‌కు 1400 మంది ఉద్యోగుల లేఖ
  • మాజీ ఉద్యోగులకు నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్
  • వీసా సమస్య ఎదుర్కొనేవారిని ప్రత్యేకంగా ఆదుకోవాలని సలహా
  • యుద్ధ ప్రాంతాల్లో లేఆఫ్ చేపట్టవద్దని సూచన

ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ ఇప్పటివరకూ 12 వేల మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 1400 మంది గూగుల్‌ ఉద్యోగులు ఉమ్మడిగా  సీఈఓ సుందార్ పిచాయ్‌కు తాజాగా ఓ బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగుల క్షేమం కోసం పలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 

ప్రస్తుతం కొత్త నియామకాలను చేపట్టవద్దని ఉద్యోగులు తమ లేఖలో సూచించారు. అంతేకాకుండా.. తొలగింపులు చేపట్టేముందు స్వచ్ఛందంగా రిజైన్ చేసేందుకు ఉద్యోగులకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. భవిష్యత్తులో గూగుల్‌ చేపట్టే నియామకాల్లో ఇప్పుడు ఉద్యోగం కోల్పోయిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇక యుద్ధం, ఇతర మానవ సంక్షోభాలను ఎదుర్కొంటున్న దేశాల్లోని గూగుల్ ఉద్యోగులను తొలగించకూడదని కూడా వారు డిమాండ్ చేశారు. ఇక ఉద్యోగం పోతే వీసా సంబంధిత సమస్యలు ఎదుర్కొనేవారికి సంస్థ ప్రత్యేకంగా సాయం అందించాలని డిమాండ్ చేశారు. 

‘‘గూగుల్‌లో లేఆఫ్స్ తాలుకు ప్రతికూల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. అయితే.. ఉద్యోగుల వాణిని గట్టిగా వినిపించిన దాఖలాలైతే లేవు. వర్కర్ల ఐకమత్యంతో మా వాణిని బలంగా వినిపించవచ్చని అర్థమైంది’’ అని ఉద్యోగులు తమ లేఖలో పేర్కొన్నారు.  లేఆఫ్స్ ప్రారంభమయ్యాక తొలిసారిగా ఉద్యోగులు ఈ బహిరంగ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉద్యోగుల తొలగింపుల గురించి సీఈఓ సుందర్ పిచాయ్ జనవరి 20న ప్రకటించారు. సంస్థలోని 6 శాతం మంది సిబ్బందిని తొలగించబోతున్నట్టు పేర్కొన్నారు. తమ అంచనాకు భిన్నమైన ఆర్థికపరిస్థితి ఎదుర్కొంటున్నామని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. ఇక గూగుల్‌తో పాటూ మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా లాంటి సంస్థలన్నీ ఉద్యోగులపై నిర్దాక్షిణ్యంగా వేటు వేశాయి. 


Google layoffs
Sundar Pichai
  • Loading...

More Telugu News