అంబులెన్స్ లో చెప్పులు, బూట్లు తరలించిన డ్రైవర్.. వేటువేసిన ప్రభుత్వం!

సమయానికి అంబులెన్స్ లు రాక ప్రాణాలు కోల్పోయారని.. అంబులెన్స్ ఏర్పాటు చేయకపోవడంతో మృతదేహాలను భుజాన వేసుకుని కాలినడకన వెళ్లారని తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే, అత్యవసర పరిస్థితిలో ఉపయోగపడాల్సిన అంబులెన్స్ ను ఓ డ్రైవర్ సొంత అవసరాలకు వాడుకున్నాడు. 

రాజస్థాన్ లోని జైపూర్ నుంచి దౌసాకు అంబులెన్స్ లో చెప్పులు, బూట్లను ట్రాన్స్ పోర్ట్ చేశాడో డ్రైవర్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ అంబులెన్స్ దౌసా ప్రభుత్వ ఆసుప్రతికి చెందినదిగా గుర్తించారు. ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫుట్ వేర్ ను తరలిస్తున్నట్లు తెలిసింది. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే డ్రైవర్ ను విధుల నుంచి తొలగించారు. 
 
‘‘అంబులెన్స్ డ్రైవర్ ను ఓ ఎన్జీవో నియమించింది. అతడిని విధుల్లో నుంచి తొలగించాం. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశాం. కమిటీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటాం’’ అని దౌసా ప్రభుత్వ ఆసుపత్రి ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ శివరామ్ మీనా తెలిపారు. ఇది చాలా తీవ్రమైన విషయమని, నిందితుడిపై నిర్ణీత సెక్షన్ల ఆధారంగా కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ అంబులెన్స్ ను ఎమ్మెల్యే కోటాలో తెచ్చినట్లు సమాచారం.

Shoes Transported In Ambulance
Rajasthan
Driver
Jaipur

More Telugu News