లోకేశ్ పాండిత్యాన్ని చూస్తే ఆయనను ఒక పులకేశి అనాల్సిందే: మంత్రి రోజా విమర్శనాస్త్రాలు

Roja satires on Nara Lokesh
  • సీఎం జగన్ ను విమర్శించే అర్హత లోకేశ్ కు లేదన్న రోజా
  • నిరుద్యోగులకు జగన్ ఉద్యోగాలు ఇచ్చారన్న విషయం గమనించాలని వ్యాఖ్య 
  • లోకేశ్ దొంగదారిలో తండ్రి క్యాబినెట్ లో మంత్రి అయ్యారని ఎద్దేవా  
యువగళం పాదయాత్ర ప్రారంభ సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. లోకేశ్ పాండిత్యాన్ని చూస్తే ఆయనను ఒక పులకేశి అనాల్సిందేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నిరుద్యోగులు రోడ్లపైకి వస్తున్నారని లోకేశ్ అంటున్నాడని, నిరుద్యోగులకు జగన్ ఉద్యోగాలు ఇచ్చారన్న విషయం గమనించాలని రోజా పేర్కొన్నారు. 

దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా జగన్ నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన చేపట్టారని, ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడు సంతోషంగా ఉన్నారని ఆమె వెల్లడించారు. కానీ, వాస్తవానికి రోడ్డుపైకి వచ్చింది చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ లేనని రోజా ఎద్దేవా చేశారు.

లోకేశ్ దొంగదారిలో తండ్రి క్యాబినెట్ లో మంత్రి అయ్యారని, తన తండ్రికి సంబంధం లేనివి కూడా ఆయనే నిర్మించారని లోకేశ్ చెబుతున్నారని ఆరోపించారు. సీఎం జగన్ పై మాట్లాడేందుకు లోకేశ్ కు ఏ విధంగానూ అర్హత లేదని స్పష్టం చేశారు. మంత్రి రోజా విశాఖ శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Roja
Nara Lokesh
Jagan
Yuvagalam
YSRCP
TDP

More Telugu News