జీవో నెం.1పై పూర్తయిన వాదనలు... తీర్పును రిజర్వ్ లో ఉంచిన హైకోర్టు

High Court reserves verdict on GO No1
  • ఇటీవల జీవో నెం.1ను తెచ్చిన ఏపీ ప్రభుత్వం
  • హైకోర్టులో పిటిషన్ దాఖలు
  • జీవోను ఈ నెల 23 వరకు సస్పెండ్ చేసిన కోర్టు
  • సుప్రీంను ఆశ్రయించిన ఏపీ సర్కారు
  • హైకోర్టే విచారిస్తుందన్న సుప్రీం
  • నిన్నటి నుంచి హైకోర్టులో విచారణ షురూ
ఇటీవల ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద జీవోపై హైకోర్టులో నేడు వాదనలు పూర్తయ్యాయి. హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. వాదనల సందర్భంగా... జీవో నెం.1పై సస్పెన్షన్ కొనసాగించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అందుకు, హైకోర్టు ధర్మాసనం నిరాకరించినట్టు తెలుస్తోంది. 

రోడ్లపై సభలు, సమావేశాలు, రోడ్ షోల అనుమతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇటీవల జీవో నెం.1 తీసుకువచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ  హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ నెల 23 వరకు జీవోను సస్పెండ్ చేసింది. 

దీన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేయగా, ఈ జీవో విషయంలో తాము జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాదు, దీనిపై హైకోర్టు విచారణ జరుపుతుందని తేల్చి చెప్పింది. 

ఈ నేపథ్యంలో, సస్పెన్షన్ గడువు నిన్నటితో ముగియడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ షురూ చేసింది. వెకేషన్ బెంచ్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది.
Go Back to Shorts
AP High Court
G.O.No.1
AP Govt
Supreme Court

More Telugu News