డిగ్రీ విద్యార్థుల నైపుణ్యాలను బాగా పెంచాలి: సీఎం జగన్
- ఉన్నత విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష
- వివిధ కోర్సులను సిలబస్ లో చేర్చాలని సూచన
- డిమాండ్ ఉన్న కోర్సులు ప్రవేశపెట్టాలని దిశానిర్దేశం
- ఉన్నత విద్యాశాఖలో ఖాళీలపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు
ఉన్నత విద్యాశాఖలో ఖాళీ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టాలని, కోర్టు కేసులు పరిష్కరించుకుని జూన్ నాటికి భర్తీ ప్రక్రియ చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యాశాఖలో సంస్కరణలు చేపడుతున్నామని, నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
కాగా, సీఎం జగన్ ఈ సమీక్ష సమావేశంలో ప్రైవేటు బీఈడీ కళాశాలల్లో బోధన, వసతుల అంశంపైనా చర్చించారు. బోధన సిబ్బంది, వసతి సౌకర్యాలను ప్రమాణంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. బోధన సిబ్బంది సామర్థ్యం మెరుగుపర్చడం కోసం చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తిరుపతి, విశాఖలోని స్టాఫ్ కాలేజీలను బలోపేతం చేయాలని పేర్కొన్నారు. సెంట్రల్ ఆంధ్రా పరిధిలో అకడమిక్ స్టాఫ్ కాలేజి ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రిపుల్ ఐటీల్లో సిబ్బంది భర్తీ, సమస్యలు పరిష్కరించాలని తెలిపారు.