sasitharoor: 2024 ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లొస్తాయంటే..? కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ జోస్యం

వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ పెద్ద సంఖ్యలో సీట్లను కోల్పోతుందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ జోస్యం చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ వెలిగిపోయిందని, కానీ ఈసారి జరిగే ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేదని తేల్చిచెప్పారు. కోజికోడ్ లో జరిగిన కేరళ లిటరేచర్ ఫెస్టివల్ లో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల ఫలితాలను 2024లో పునరావృతం చేయడం బీజేపీకి సాధ్యంకాదని అన్నారు. 

ఇప్పటికే పలు రాష్ట్రాలలో అధికారం కోల్పోయిన బీజేపీ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలోనూ అధికారం కోల్పోవచ్చని శశిథరూర్ అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో హర్యానా, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని అన్ని లోక్ సభ స్థానాల్లోనూ బీజేపీ గెలిచిందని, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో ఒక్కో సీటు తప్ప మిగతా స్థానాలు కైవసం చేసుకుందని శశిథరూర్ తెలిపారు.

మొత్తంగా 543 లోక్ సభ స్థానాలకు గానూ 303 సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకుందని గుర్తుచేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు 272 సీట్లు అవసరం కాగా.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఈ మార్కును అందుకోలేదని చెప్పారు. ఇది విపక్షాలకు అవకాశంగా మారుతుందని, విపక్షాలు ఏకతాటిపై నిలబడితే బీజేపీని అధికారానికి దూరం చేయొచ్చని శశిథరూర్ అభిప్రాయపడ్డారు.
sasitharoor
Congress
Kerala
bjp
2024 elections
Lok Sabha

More Telugu News