Mallikarjun Kharge: మీరేమైనా పూజారా?: అమిత్ షాపై మల్లికార్జున ఖర్గే సెటైర్

2024 జనవరి 1వ తేదీ నాటికి అయోధ్య రామమందిరం ప్రారంభమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. ఈ విషయాన్ని ఏ హోదాతో అమిత్ షా ప్రకటించారని ఆయన ప్రశ్నించారు. మీరు (అమిత్ షా) పూజారి కాదు, రామ మందిరానికి సంబంధించిన మహంత్ కూడా కాదని ఎద్దేవా చేశారు. 

ప్రతి ఒక్కరికీ దైవంపై నమ్మకం ఉంటుందని... అయితే, త్వరలో త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సమయంలో, 2024లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇలాంటి ప్రకటనను ఎందుకు చేశారని ప్రశ్నించారు. మీరొక రాజకీయవేత్త అని, కేంద్ర హోంమంత్రిగా దేశ భద్రతను, దేశంలో శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన బాధ్యత మీదని చెప్పారు. 

ఆలయాలకు సంబంధించిన ప్రకటనలు మీకెందుకని ప్రశ్నించారు. ప్రజలకు ఆహార భద్రతను కల్పించడం, రైతుల పంటలకు గిట్టుబాటు ధరను కల్పించడం వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు.
Mallikarjun Kharge
congress
Amit Shah
BJP

More Telugu News