రాష్ట్రంలో బీజేపీ పాలన మరో 100 రోజులే... 136 స్థానాల్లో గెలుస్తాం: డీకే శివకుమార్

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ కు 136 స్థానాలు వస్తాయని తేలిందని... బీజేపీ కేవలం 60 నుంచి 70 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని చెప్పారు. జేడీఎస్ పరిస్థితి ఏమిటనే విషయం గురించి మరోసారి చెపుతానని అన్నారు. రాష్ట్ర ప్రజల తరపున నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉన్నామని, రెండేళ్లుగా ప్రజల మధ్యే ఉంటూ బీజేపీ ప్రభుత్వ అవినీతిని ఎండగడుతున్నామని చెప్పారు. కోవిడ్ కష్ట సమయంలో సైతం నిద్రను కూడా మానుకుని ప్రజల మధ్యే ఉన్నామని తెలిపారు. మరో 100 రోజులు మాత్రమే బీజేపీ పాలన ఉంటుందని అన్నారు. 

గత మూడేళ్ల కాలంలో ప్రజల కడుపు నింపే ఒక్క పథకాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదని శివకుమార్ చెప్పారు. దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా కర్ణాటకకు పేరు వచ్చిందని మండిపడ్డారు. గుజరాత్ ఎన్నికల ప్రభావం కర్ణాటకపై ఉండదని చెప్పారు. కాంగ్రెస్ లో సీఎం ఎవరనే విషయం గురించి బీజేపీ నేతలు చర్చించడం... వారు ఓటమిని అంగీకరించడమేనని అన్నారు. తనను రౌడీ షీటర్ అంటున్నారని... దానికి ఎక్కడైనా ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు.

DK Shivakumar
Congress
Karnataka
BJP
JDS

More Telugu News