North Korea: ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలపై ఆగ్రహం.. మరిన్ని ఆంక్షలతో విరుచుకుపడిన అమెరికా

వరుస క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలకు నిద్రను దూరం చేస్తున్న ఉత్తరకొరియాపై అమెరికా సహా జపాన్, దక్షిణ కొరియాలు మరిన్ని ఆంక్షలు విధించాయి. జోన్ ఇల్ హో, యు జిన్, కిమ్ సు గిల్‌పై నిషేధం విధిస్తూ అమెరికా ట్రెజరీ విభాగం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సామూహిక విధ్వంసక ఆయుధాల అభివృద్ధిలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారని పేర్కొంది. 

సింగపూర్, తైవాన్‌ కు చెందిన ఒక్కొక్కరితో పాటు మొత్తం ఏడుగురు వ్యక్తులు సహా 8 సంస్థలపై దక్షిణ కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధించింది. ఇవన్నీ ఇప్పటికే జనవరి 2018, అక్టోబరు 2022 మధ్య అమెరికా విధించిన ఆంక్షల కింద ఉన్నట్టు తెలిపింది. జపాన్ కూడా మూడు సంస్థలు, ఓ వ్యక్తిపై కొత్తగా ఆంక్షలు విధించింది. సైబర్ దాడులకు పాల్పడినట్టుగా అనుమానిస్తున్న లాజరస్ గ్రూప్ కూడా ఇందులో ఉంది. 

నవంబరు 18న ఉత్తరకొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)ని ప్రయోగించిన నేపథ్యంలో అమెరికా, దాని మిత్రదేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. క్షిపణి పరీక్షల విషయంలో ఈ ఏడాది మరింతగా చెలరేగిపోయిన ఉత్తరకొరియా 60కిపైగా క్షిపణులను పరీక్షించింది. దీంతో 2017లో నిలిపేసిన అణ్వాయుధ పరీక్షలను ఆ దేశం తిరిగి ప్రారంభించబోతోందన్న ఆందోళన వ్యక్తమైంది.
North Korea
USA
South Korea
Japan
Sanctions

More Telugu News