Eatala Rajendar: మునుగోడు ఫలితాల వెల్లడిలో జాప్యంపై అనుమానాలున్నాయి: ఈటల

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. మునుగోడు ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతుండడంపై అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. పోలింగ్ ముగిసినా టీఆర్ఎస్ నేతలు మునుగోడులోనే ఉన్నారని వెల్లడించారు. 

టీఆర్ఎస్ ఓడితే పెన్షన్లు రద్దవుతాయని మంత్రులు బెదిరించారని ఆరోపించారు. మంత్రులు పాలన వదిలి మునుగోడులో తిష్టవేశారని పేర్కొన్నారు. ప్రత్యర్థులను ప్రచారం చేసుకోనివ్వకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారని మండిపడ్డారు. పోలింగ్ సిబ్బందిని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని ఈటల తెలిపారు. 

సీఎం స్వయంగా ఎమ్మార్వో, ఎండీవోలతో మాట్లాడే స్థాయికి దిగజారారని వివరించారు. మునుగోడులో నైతికంగా బీజేపీనే విజయం సాధించిందని అన్నారు. శామీర్ పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు.
Eatala Rajendar
Munugode
Counting
BJP
TRS

More Telugu News