Sourav Ganguly: బీసీసీఐ బాస్‌గా వైదొలగనున్న గంగూలీ.. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ-టీఎంసీ మధ్య డిష్యుం డిష్యుం!

Sourav Gangulys decision to step down as BCCI president sparks betwen TMC and BJP war

  • గంగూలీ బీజేపీలో చేరనన్నందుకే పదవిని లాగేసుకున్నారన్న టీఎంసీ ఎంపీ శంతను సేన్ 
  • జై షా అయితే పనికొస్తాడు కానీ, గంగూలీ కొనసాగేందుకు పనికిరాడా? అని ప్రశ్న
  • రాజకీయాలు మాని బెంగాల్‌లో క్రీడల అభివృద్ధికి కృషి చేయాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి సౌరవ్ గంగూలీ తప్పుకోబోతున్నట్టు వస్తున్న వార్తలు బెంగాల్‌లో అధికార తృణమూల్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి. గంగూలీని లక్ష్యంగా చేసుకున్నారని, ఇది రాజకీయ ప్రతీకార చర్య అని టీఎంసీ ఆరోపించింది. రాజకీయ ప్రతీకారానికి ఇది మరో ఉదాహరణ అని బీజేపీపై దుమ్మెత్తి పోసింది. కేంద్రమంత్రి అమిత్ షా కుమారుడినైతే బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగించొచ్చు కానీ, గంగూలీ మాత్రం అధ్యక్షుడిగా కొనసాగేందుకు అర్హుడు కాదా? అని ప్రశ్నించింది. గంగూలీ పశ్చిమ బెంగాల్‌కు చెందినవాడనా? లేదంటే బీజేపీలో చేరలేదని ఈ నిర్ణయం తీసుకున్నారా? అని నిలదీసింది. తాము మాత్రం ‘దాదా’కు అండగా ఉంటామని టీఎంసీ ఎంపీ శంతను సేన్ తేల్చి చెప్పారు. 

అమిత్ షా ఈ ఏడాది మేలో గంగూలీ నివాసానికి విందు కోసం వచ్చారని గుర్తు చేసిన శంతను సేన్.. బీజేపీలో చేరాలని గంగూలీని పలుమార్లు కోరారని అన్నారు. ముఖ్యమంత్రి మమతకు వ్యతిరేకంగా గంగూలీని తీసుకురావాలని ఆయన ప్రయత్నించారని ఆరోపించారు. అయితే, గంగూలీ మాత్రం అందుకు అంగీకరించలేదని, అందుకనే ఆయన పదవిని లాగేసుకున్నారని అన్నారు. ఇది ముమ్మాటికి రాజకీయ ప్రతీకారేచ్ఛేనని, క్రీడలను కూడా కాషాయీకరణ చేయడమేనని అన్నారు. అన్ని అత్యున్నత నిర్వాహక పదవులను బీజేపీ తమ నాయకుల కుటుంబ సభ్యులకే కేటాయించిందని అన్నారు. 

టీఎంసీ ఎంపీ శంతను సేన్ ఆరోపణలకు బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. శంతన్ సేన్, ఆయన పార్టీకి గంగూలీ ఏ రకంగా సాయం చేశారో తనకైతే తెలియదు కానీ, టీఎంసీ రాజకీయాలకు పూర్తిగా అలవాటు పడి దానిని కొనసాగిస్తోందని విమర్శించారు. రోజర్ బిన్నీకి బీజేపీతో సంబంధం ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీని లక్ష్యంగా చేసుకోవడానికి ముందు బెంగాల్‌లో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తే మంచిందని టీఎంసీకి హితవు పలికారు. 

సౌరవ్ గంగూలీ 19 నవంబర్ 2019న బీసీసీఐ బాస్‌గా నియమితులయ్యారు. ఈ వారం మొదట్లో ఢిల్లీలో జరిగిన బీసీసీఐ ప్రముఖుల సమావేశంలో బీసీసీఐ చీఫ్ పదవికి తానిక పోటీ చేయనని గంగూలీ చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో 1983లో ప్రపంచకప్ సాధించిన భారత జట్టులో సభ్యుడైన రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్ష రేసులోకి వచ్చాడు. పోటీ కోసం నామినేషన్ కూడా దాఖలు చేశాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే రోజర్ బిన్నీ బీసీసీఐ తదుపరి బాస్ అవుతారు. అమిత్ షా కుమారుడు జై షా మాత్రం బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగనున్నారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడైన అరుణ్ ఠాకూర్ బీసీసీఐ పదవికి మళ్లీ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

Sourav Ganguly
BCCI
TMC
BJP
Shantanu Sen
Amit Shah
Roger Binny
  • Loading...

More Telugu News