Sri Lanka: స్టార్లు అవసరం లేదని శ్రీలంక నిరూపించింది: ఆనంద్ మహీంద్రా

ఆసియాకప్ ఫైనల్‌లో బలమైన పాకిస్థాన్ జట్టును ఓడించిన శ్రీలంక ట్రోఫీని ఎగరేసుకుపోవడంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఆయన తాజాగా చేసిన ట్వీట్ అందరినీ ఆలోచనల్లో పడేసింది. ఓ జట్టు విజయం సాధించేందుకు స్టార్ ఆటగాళ్లు అవసరం లేదని, కలిసికట్టుగా ఆడితే సరిపోతుందని అన్నారు. 

శ్రీలంక సాధించిన విజయం తనకు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించిందన్న ఆయన.. ఈ విజయం పాకిస్థాన్ ఓటమి వల్ల వచ్చింది కాదని అన్నారు. టీమ్ గేమ్స్‌లో విజయం అన్నది సెలబ్రిటీలు, సూపర్ స్టార్లు ఉన్నారన్న దానికంటే.. కలిసికట్టుగా ఆడడంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. పాకిస్థాన్‌పై శ్రీలంక సాధించిన విజయం దీనిని గుర్తు చేస్తోందన్నారు. 

కాగా, ఆసియా కప్‌లో శ్రీలంక ప్రస్థానం నిజంగా అద్భుతమే. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ చేతిలో దారుణంగా ఓడిన లంక.. ఆ తర్వాత పుంజుకున్న తీరు అమోఘం. పడిలేచిన కెరటంలా విజృంభించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి భారత్, పాక్ వంటి బలమైన జట్లను సూపర్-4లో మట్టికరిపించింది. అదే ఊపులో ఫైనల్‌లో మరోమారు పాక్‌పై పైచేయి సాధించి టోఫ్రీ గెలుచుకుంది.
Sri Lanka
Pakistan
Anand Mahindra
Aisa Cup

More Telugu News